తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార డీఎంకేతో పొత్తు చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ, మరోవైపు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీతో మంతనాలు జరపడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి.. శుక్రవారం చెన్నైలో విజయ్తో రహస్యంగా భేటీ అయ్యారు. డీఎంకేతో సీట్ల పంపకంపై కాంగ్రెస్ కమిటీ చర్చలు జరిపిన 48 గంటల్లోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమకు 40 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే, 20 నుంచి 25 సీట్లకు మించి ఇచ్చేందుకు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ సుముఖంగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలో డీఎంకేపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ఈ భేటీని తెరపైకి తెచ్చిందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.చెన్నైలోని టీవీకే కార్యాలయంలో విజయ్, ప్రవీణ్ చక్రవర్తి మధ్య గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ భేటీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని తమిళనాడు కాంగ్రెస్ నేతలు చెప్పడం గమనార్హం. పార్టీ అధిష్ఠానం అనుమతి లేకుండా ప్రవీణ్ ఈ సమావేశం నిర్వహించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం మిత్రపక్షమైన డీఎంకేలోనూ అసంతృప్తికి కారణమైంది. ఒకవేళ డీఎంకేతో సీట్ల సర్దుబాటు కుదరకపోతే, విజయ్తో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa