ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేయండి.. ఇండిగో సంస్థకు కేంద్రం డెడ్‌లైన్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 08:52 PM

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో గత కొన్ని రోజులుగాతీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడి.. వెయ్యికి పైగా విమానాలు రద్దు కావడంతో..టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు.. ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఇండిగో సంస్థపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. రద్దయిన అన్ని విమానాల టికెట్ రిఫండ్‌లను ఆదివారం రాత్రి 8 గంటల లోపు పూర్తి చేయాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.


శుక్రవారం ఒక్కరోజే 1,000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన ఇండిగో సంస్థ.. శనివారం కూడా 400 పైగా విమానాలను రద్దు చేయడంతో పరిస్థితి తీవ్ర గందరగోళానికి దారితీసింది. రద్దైన విమానాలకు సంబంధించిన అన్ని టికెట్ రీఫండ్‌లను డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటలలోగా పూర్తి చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగోను ఆదేశించింది. ప్రయాణికులకు డబ్బులు చెల్లించే ప్రక్రియలో జాప్యం లేదా విఫలమైనా.. తక్షణమే నియంత్రణ చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది.


ఇక విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల షెడ్యూల్ ప్రభావితమైన ప్రయాణికుల నుంచి రీ షెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయవద్దని కూడా ఇండిగోకు కేంద్రం సూచించింది. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడానికి, సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ ఇండిగోకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ప్రయాణికులకు సహాయం చేసేందుకు టీమ్‌లను.. రీఫండ్ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.


ఈ బృందాలు ప్రభావిత ప్రయాణికులను చురుకుగా సంప్రదించి.. మళ్లీ ఫాలో అప్‌లు అవసరం లేకుండానే రీఫండ్‌లు, ప్రత్యామ్నాయ ప్రయాణాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. విమాన కార్యకలాపాలు పూర్తిగా స్థిరపడే వరకు ఆటోమేటిక్ రీఫండ్‌ల వ్యవస్థ కొనసాగాలని ఇండిగోను పేర్కొంది. రద్దీ కారణంగా ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ విషయంలో కూడా కేంద్రం ఇండిగో సంస్థకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. విమానాలు రద్దు లేదా ఆలస్యం కారణంగా ప్రయాణికుల లగేజీని 48 గంటల్లో గుర్తించి వారికి అందజేయాలని తెలిపింది.


లగేజీ ట్రాకింగ్, డెలివరీ సమయాల గురించి ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. అవసరమైతే ప్రస్తుత ప్రయాణికుల హక్కుల నిబంధనల ప్రకారం నష్ట పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించారు. వచ్చే 3 రోజుల్లో సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన షెడ్యూల్‌లు శనివారం నాటికి సాధారణ స్థితికి వస్తాయని పేర్కొన్నారు. ఇండిగో విమాన ప్రయాణాల్లో అంతరాయాలకు కారణాలు, బాధ్యతలను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి విచారణకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa