ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్డగోలు వసూళ్లకు చెక్, విమాన టికెట్ల ధరపై కేంద్రం నియంత్రణ

national |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 08:48 PM

ఇండిగో విమానయాన సంస్థ రద్దు చేసిన విమానాల కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అనేక విమానయాన సంస్థలు ఒక్కసారిగా టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లేందుకు విమాన టికెట్ ఖర్చు.. విదేశాలకు వెళ్లిన టికెట్ ఖర్చు కంటే ఎక్కువగా ఉండటంపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.


ఇండిగో సంక్షోభం వేళ.. మిగిలిన ఎయిర్‌లైన్ సంస్థలు భారీగా టికెట్ ధరలను పెంచడంపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అధిక ధరలు వసూలు చేస్తున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు విమాన టికెట్ ధరలపై పరిమితులను విధించింది.


 ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. దేశంలోని ప్రధాన నగరాల మధ్య టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీ-ముంబై విమాన టికెట్ రూ.65,460 వరకు.. కోల్‌కతా-ముంబై టికెట్ రూ.90 వేల వరకు వసూలు చేశాయి. ఇది సాధారణ ధరల కంటే భారీగా పెరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రయాణికులను విమానయాన సంస్థలు.. ఆర్థికంగా దోపిడీ చేయకుండా రక్షించేందుకు.. సంక్షోభ సమయంలో ధరలను పెంచడాన్ని నిరోధించేందుకు కేంద్రం.. తమ నియంత్రణ అధికారాలను ఉపయోగించింది.


ఈ నేపథ్యంలోనే విమానాల ధరలపై విమానయాన శాఖ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా అన్ని దేశీయ విమానాల ఎకానమీ క్లాస్ టికెట్ ధరలపై గరిష్ఠ పరిమితులను విధించింది. ఈ ధరలు దూరం ఆధారంగా నిర్ణయించినట్లు తెలిపింది. 500 కిలోమీటర్ల వరకు గరిష్ఠంగా రూ.7,500 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. 500 నుంచి 1000 కిలోమీటర్లు ఉంటే గరిష్ఠంగా రూ.12 వేలు.. 1000 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్లు ఉంటే రూ.15 వేలు.. 1500 కిలోమీటర్ల పైన రూ.18 వేలు గరిష్ఠంగా టికెట్ ధర ఉండాలని నియంత్రణ విధించింది.


బిజినెస్ క్లాస్ టికెట్‌లు, ఆర్‌సీఎస్-ఉడాన్ పథకం కింద నడిచే విమానాలకు మాత్రం ఈ ధరల పరిమితి నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ఇండిగో సంక్షోభ పరిస్థితి పూర్తిగా స్థిరపడే వరకు.. ఈ ధరల పరిమితులు అమలులో ఉంటాయని కేంద్రం వెల్లడించింది. ఈ నిబంధనలను ఏ ఎయిర్‌లైన్ సంస్థ అయినా ఉల్లంఘిస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తీవ్రంగా హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa