ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సైన్యానికి ఏకంగా 40 వేల ఇజ్రాయెల్ లైట్ మెషీన్ గన్స్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 08:47 PM

ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ).. భారత్‌కు భారీగా అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మొదట్లో దాదాపు 40 వేల లైట్ మెషిన్ గన్స్‌ను భారత్‌కు అందించనున్నట్లు ఐడబ్ల్యూఐ సీఈవో షుకి స్క్వాట్జ్ తాజాగా వెల్లడించారు. గతేడాది ఐడబ్ల్యూఐతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా.. తొలి దశ లైట్ మెషిన్ గన్స్‌ సరఫరాకు సిద్ధమైంది. ఐడబ్ల్యూఐ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపిన వివరాల ప్రకారం.. 40 వేల లైట్ మెషీన్ గన్స్‌ను సరఫరా చేయడానికి సంబంధించిన పరీక్షలు, తనిఖీలు పూర్తైనట్లు తెలిపారు.


వీటిని ఉత్పత్తి చేసేందుకు తమకు లైసెన్స్ లభించిందని.. వీటి తొలి బ్యాచ్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు అందించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం తుపాకుల సరఫరా 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. వీటితోపాటు.. క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ కార్బైన్స్‌కు సంబంధించిన టెండర్ భారత్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం సంతకాలు చేసే దశలో ఉంది. ఈ ఒప్పందంలో భారత్ ఫోర్జ్ ప్రైమరీ బిడ్డర్‌గా ఉన్నప్పటికీ.. ఐడబ్ల్యూఐ రెండో బిడ్డర్‌గా ఉంది. మొత్తం కాంట్రాక్ట్‌లో ఐడబ్ల్యూఐ 40 శాతం అంటే దాదాపు 1.70 లక్షల ఆయుధాలను సరఫరా చేస్తుంది.


మరోవైపు.. ఈ ఆయుధాల్లో మిగిలిన 60 శాతం.. భారత్ ఫోర్జ్ నుంచి.. మిగతా 40 శాతం అదానీ గ్రూపు అనుబంధ సంస్థ అయిన పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ద్వారా భారత్‌లోకి సరఫరా చేయనున్నారు. ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అర్బెల్ కంప్యూటరైజ్డ్ రైఫిల్ టెక్నాలజీపై చర్చలు


ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ అయిన అర్బెల్ టెక్నాలజీని భారత్‌కు అందించడంపై ఐడబ్ల్యూఐ వివిధ ఏజెన్సీలతో ప్రాథమికంగా చర్చలు జరుపుతోంది. ఈ అర్బైల్ వ్యవస్థలో అధునాతన సెన్సర్‌లు ఉంటాయి. రియల్ టైమ్ బాలిస్టిక్ కంప్యూటేషన్ ద్వారా సైనికులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలరు. ఇందులో ఉపయోగించే మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ఆయుధం లక్ష్యాన్ని ఛేదించగలదా అని మిల్లీసెకన్లలో అంచనా వేస్తుంది.


ఇక ఈ ఒప్పందం ఖరారైతే.. ఇజ్రాయెల్‌తోపాటు భారత్‌లోనూ అదానీ అనుబంధ పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ద్వారా ఈ అర్బైల్ టెక్నాజీని తయారీని చేపట్టే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ ఉంటే.. యుద్ధభూమిలో సైనికుల కచ్చితత్వాన్ని, చురుకుదనాన్ని పెంచుతుందని ఐడబ్ల్యూఐ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపారు. తమ పిస్టల్స్, రైఫిల్స్, ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి భారత హోంశాఖలోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతునిస్తూ.. స్థానిక ఉత్పత్తి, విస్తరణకు ఉపయోగపడుతున్న తొలి కంపెనీల్లో తమది కూడా ఒకటి అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa