ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మామిడితోటకు పని కోసం వెళ్తే.. ప్రాణాలు పోయాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 08:34 PM

అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్‌ వద్ద నివసించే నరేంద్ర , చరణ్‌ సోదరులు. వీరిద్దరూ తల్లిదండ్రులు, మరికొందరితో కలిసి ఆదివారం ఉదయం పాల వెంకటాపురం గ్రామంలోని మామిడితోటకు పని కోసం వెళ్లారు. మామిడి తోటలోని చెట్లకు పురుగులమందు పిచికారీ చేయడానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ మామిడితోటలోని నీటికుంటలో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు పనిలో ఉన్న సమయంలో నరేంద్ర, చరణ్ నీటి కుంట వద్దకు వెళ్లారు.


ఈ సమయంలో చరణ్ ప్రమాదవశాత్తూ కాలుజారి నీటి కుంటలో పడిపోయారు. తమ్ముణ్ని కాపాడే ప్రయత్నంలో అన్న నరేంద్ర కూడా నీటికుంటలో పడిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవటంతో.. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నీటి కుంట వద్దకు వెళ్లినవారు ఎంతకూ రాకపోవటంతో తోటి కూలీలు అక్కడకు వెళ్లి చూస్తే.. ఇద్దరి మృతదేహాలు నీటికుంటలో కనిపించాయి. పనికోసం వెళ్లి ఇలా ప్రమాదవశాత్తూ ప్రాణాలు పోగొట్టుకోవటంతో ఆ కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దట్టమైన పొగముంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని కుసుమ, ధర్మరావు దంపతుల కూతురు వినీల సైకాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. నిమ్హాన్స్‌లో ట్యూటర్‌గా పని చేస్తున్నారు.


పని మీద బెంగళూరుకు వెళ్లిన ఆమె.. పని పూర్తైన తర్వాత బెంగళూరు నుంచి సికింద్రబాద్ స్కూటీ మీద బయల్దేరారు. అయితే మామిళ్లపల్లి వద్ద శనివారం ఉదయం దట్టంగా పొగ మంచు అలుముకోవటంతో రోడ్డు సరిగా కనిపించక డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావటంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa