కడప మాజీ మేయర్ కె. సురేశ్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. కడప నగర మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో, మేయర్ ఎన్నిక ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, తనను మేయర్ పదవి నుంచి తొలగించడంపై వేసిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉందని, కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు 2026 మార్చి వరకు ఉందని సురేశ్ బాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించడం పురపాలక చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.ఈ వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఆరు నెలల నిబంధన సభ్యుల ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని, పరోక్ష పద్ధతిలో జరిగే మేయర్ ఎన్నికకు ఇది వర్తించదని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, సురేశ్ బాబు పిటిషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ తీర్పుతో, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్ను ఎన్నుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa