ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, నాన్న తిట్టాడని, అమ్మ ఫోన్ కొనివ్వలేదని, వీసా రాలేదని, సోషల్ మీడియాలో పోస్టుకు లైకులు రావడం లేదని.. ఇలా చిన్న సంఘటనలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ముందూ వెనుక ఆలోచించకుండా క్షణికావేశంలో ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఓ బాలిక కూడా ఇలాగే ప్రాణం తీసుకుంది. ఇంగ్లీష్ రావడం లేదని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన యువతలో పెరగుతున్న ఆత్మహత్యలపై ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు దగ్గర తండ్రపాడులో ఉన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కేంద్రంలో 17 ఏళ్ల బాలిక చదువుతోంది. అయితే తనకు ఇంగ్లీష్ రావడం లేదని తన తండ్రితో చెప్పింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కంటే చావడం చాలా సులభం అని చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు బాలికను నచ్చజెప్పి బలవంతంగా కాలేజీకి పంపించారు. ఈ నేపథ్యంలో కాలేజీలో గురువారం.. తన స్నేహితులు బయటకు వెళ్లిన తర్వాత బాలిక సిక్ రూమ్కు లోపలి నుంచి గడియ పెట్టుకుంది. అనంతరం ఆత్మహత్యకుపాల్పడింది.
ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బందితో పాటు నెలసరి విషయంలోనూ బాలిక సమస్యలు ఎదుర్కుంటోందని దళిత బాలిక స్నేహితులు తెలిపారు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాలిక బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇలా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్లు ఇటీవల NCRB గణాంకాలు వెల్లడించాయి.
మానసికంగా బాధపడుతున్న పిల్లలవిషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను టీనేజీ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడానికి జంకుతారు. అయితే తాజా ఘటనలో తమ సమస్యను బాలిక తల్లిదండ్రులకు వివరించింది. అయినా వారు నచ్చజెప్పి మళ్లీ కాలేజీకి పంపించడం ఆందోళన కలిగించే విషయం. ఇంగ్లీష్ భాషపై ఆమెలో ఉన్న భయాన్ని పొగొట్టేలా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
గతంలో కడపలోని అసోక్ నగర్కు చెందిన డిగ్రీ విద్యార్థిని ఇంగ్లిష్ మీడియంలో చదువు అర్థం కాలేదనే మనోవేదనతో 2023లో ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివి.. అనంతరం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయింది. దీంతో ఇంగ్లీష్ రావడం లేదని ఆత్మహత్యకు పాల్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa