ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటోలో ఒకరు, బస్సులో ఒకరు, కాలేజీ ఫ్రెండ్ ఒకరు.. వారం రోజుల్లో యువతిపై ముగ్గురు

Crime |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 08:48 PM

నూరు రూపాయలు నోటు చూస్తే ప్రేమ పుట్టే కాలంరా.. ఊరు మొత్తం తిరిగి చూస్తే చూసేదంత మాయరా.. ప్రేమలేఖ సినిమాలోని ఓ పాటలో లిరిక్స్ ఇది. రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో.. లేక భవిష్యత్తును ఊహించి రాశాడో తెలియదు కానీ.. ప్రేమ అనే పదానికి అర్థం, పరమార్థం మారిపోయిందీ కాలంలో.. రచయిత చెప్పినట్టు బస్టాండు, పార్కుల వద్ద మొదలయ్యే ప్రేమ.. హోటల్ రూమ్‌లలో ముగుస్తోంది.. బయటకు వస్తే అంతా మామూలే.. మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా మారిపోయింది. భావోద్వేగాలు, బలహీనతలు.. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకునే సాధనంగా ప్రేమ మారిపోయింది. అయితే ఈ విషయం తెలియని ఓ అభాగ్యురాలు ముగ్గురి చేతిలో మోసపోయింది.. విధివంచితురాలిగా మారింది.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ప్రేమించానన్న ఆటోడ్రైవర్.. ఇంటికి తీసుకెళ్లి..


ఆ యువతిది తాడిపత్రి నియోజకవర్గం. అనంతపురంలో డిప్లొమో రెండో సంవత్సరం చదువుకుంటోంది. కాలేజీకి రోజూ ఇంటి నుంచి వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే పాతూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆ యువతికి పరిచయం అయ్యాడు. వయసు ప్రభావం.. మాటా మాటా కలిసింది. మనోడి మాటలకు మనసు కూడా కలిసిందని యువతి భ్రమపడింది. ఆటో డ్రైవర్ ప్రేమ పాఠాలకు ఆకర్షితురాలైంది. అలా ఆ యువతితో చనువు పెంచుకున్న ఆటో డ్రైవర్ డిసెంబర్ 2వ తేదీన యువతిని కాలేజీ వద్ద నుంచి ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత పంపనూరుకు తీసుకెళ్లాడు. సాయంత్రమైంది. ఇంటికి వెళ్లేందుకు యువతి సిద్ధమైంది. అయితే ఆటో డ్రైవర్ ఆ యువతిని.. ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత మనోడి అసలు స్వరూపం బయటపడింది. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


అనంతరం ఆటోడ్రైవర్ ఆ యువతిని డిసెంబర్ మూడో తేదీన సొంతూరు వెళ్లడానికి బస్సు ఎక్కించాడు. అయితే ఇంటికి వెళ్లడానికి భయపడిన యువతి తాడిపత్రిలో దిగింది. అప్పటికే బస్సులో పరిచయమైన యువకుడి షాప్ వద్దకు వెళ్లింది. షాప్ వద్దకు వచ్చిన యువతిని.. ఆ యువకుడు మాయమాటలతో నమ్మించాడు. తాను అద్దెకు ఉంటున్న గదికి తీసుకెళ్లాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్పాత కడప బస్సు ఎక్కించి పంపించాడు. ఆ బస్సులో కడప చేరుకున్న యువతి.. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లింది.


అయితే తిరుపతిలో తమ కాలేజీ ఫ్రెండ్ ఉన్న విషయం గుర్తుకువచ్చిన యువతి.. ఆ యువకుడికి ఫోన్ చేసింది. యువతి వద్దకు చేరుకున్న యువకుడు.. బాధితురాలిని తన గదికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. డిసెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకూ తన గదిలో ఉంచుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తిరుపతి నుంచి తాడిపత్రికి చేరుకున్న యువతి.. స్నేహితురాలి ఇంటికి చేరుకుంది.


మరోవైపు యువతి కనిపించకపోవటంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే యువతి కుటుంబం వద్దకు చేరుకుని జరిగిన వ్యవహారాన్ని.. ముగ్గురి చేతిలో మోసపోయిన వైనాన్ని వివరించింది. దీంతో పోలీసులు ముగ్గురిపైనా పోక్సో కేసు నమోదు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa