ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటీష్ కాలనం నాటి చట్టాలకు స్వస్తి,,,కొత్త చట్టం తీసుకురానున్న ఏపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 08:50 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డిసెంబర్ 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. అందులో భాగంగా బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను రద్దు చేసి.. జైళ్ల సంస్కరణల దిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం శాఖ రూపొందించిన 'మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023'కు అనుగుణంగా.. 'ది ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్, 2025' ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లులో పలు కీలక ప్రతిపాదనలు పొందుపర్చారు.


జైళ్లల్లో ఖైదీలు మొబైల్‌ ఫోన్లు వంటి నిషేధిత వస్తువులు వినియోగిస్తే.. వారికి సహకరించే సిబ్బందికి కూడా కఠిన శిక్షలు విధించేలా చట్టంలో ప్రతిపాదించారు. ఈ చట్టం ప్రకారం.. ఖైదీల ఫిర్యాదులు, వినతుల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా జైళ్ల అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పట్ల సిబ్బంది వ్యవహార శైలి, వైఖరిలో మార్పుల ఉండాలని చట్టంలో కీలక మార్పులు పొందుపర్చారు. వారికి వృత్తి విద్య కోర్సులు, నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నారు. ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక.. మంచి ప్రవర్తనతో సమాజంలో భాగమయ్యాలే తీర్చిదిద్దనున్నారు.


కొత్త చట్టంలో ఖైదీలకు వృత్తి విద్యా, నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందించడంతో పాటు మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు వేర్వేరుగా వసతి కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా జైళ్ల పరిపాలనలో పారదర్శకత కోసం విస్తృతంగా టెక్నాలజీ ఉపయోగించేందుకు కొత్త నిబంధనలు పొందుపర్చారు. కోర్టుల్లో విచారణ కూడా ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుండటంతో.. జైళ్లలో శిక్ష అవుభవిస్తున్న ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానాల ఎదుట హాజరుపరిచేందుకు వీలు కల్పించారు. అంతేకాకుండా ఓపెన్, హై సెక్యూరిటీ జైళ్లు, సెమీ ఓపెన్‌ జైళ్ల ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు సంబంధించిన అంశాలను కొత్త చట్టంలో పొందుపర్చారు.


తీవ్రమైన నేరాలు చేసేవారు, తరచూ నేరాలకు పాల్పడేవారి నుంచి సమాజాన్ని రక్షించేందుకు తీసుకునే చర్యలను కూడా ఇందులో ప్రస్తావించారు. పేద ఖైదీలకు న్యాయ సహాయం, పెరోల్‌ మంజూరు రూల్స్, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల ముందస్తు విడుదలకు వీలుగా కొత్త నిబంధనలు రూపొందించారు. కాగా, గంజాయి వంటి నేరాలకు పాల్పడిన ఖైదీలకు.. మానసిక వైద్య నిపుణలతో కౌన్సెలింగ్ ఇప్పిచ్చి.. వారిలో సత్పవర్తన తీసుకురావడంపై కూడా మరింత అధ్యయనం చేయాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa