రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలు, కడప కార్పొరేషన్ ఉపఎన్నికపై వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. కడప కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఆటలు సాగలేదని, మేయర్గా బీసీ నాయకుడు పాక సురేష్ను కార్పొరేటర్లు ఎన్నుకోవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టిన వివిధ రకాల ప్రలోభాలకు కార్పొరేటర్లు, ముద్దనూరు మండల ఎంపీటీసీలు లొంగకుండా ఉండటం తమ పార్టీ శక్తిని మరోసారి నిరూపించిందని రాచమల్లు అన్నారు. “ఒక్క ఎంపీటీసీకి రూ.50 లక్షలు ఇస్తామని టిడిపి నేతలు ఫోన్ చేస్తూ ప్రలోభపెట్టినా, మా నాయకులు అమ్ముడుపోలేదు. ప్రజల విశ్వాసమే మా బలం,” అని ఆయన పేర్కొన్నారు. ముద్దనూరు మండల అధ్యక్ష పదవిని కూడా వైయస్ఆర్సీపీ సునాయాసంగా కైవసం చేసుకున్నట్లు రాచమల్లు తెలిపారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎన్నికల సమయంలో అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికలను ప్రశాంతంగా, అంతర్యుద్ధాలు లేకుండా నిర్వహించిన అధికారులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికలన్నీ ఇదే తరహాలో పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa