బంగ్లాదేశ్లో అల్లరిమూకలు మరోసారి బరితెగించాయి. దేశంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న తరుణంలో, మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజ్బరి జిల్లాలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే హిందూ యువకుడిని అల్లరిమూకలు అత్యంత పాశవికంగా కొట్టి చంపాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేయడమే కాకుండా, అంతర్జాతీయంగా బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మళ్లీ చర్చను లేవనెత్తింది.
బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అమృత్ మండల్ ఇంటి వద్ద ఉండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఏమాత్రం కనికరం లేకుండా కర్రలు, రాళ్లతో అతడిపై దాడికి దిగారు. తీవ్రమైన గాయాలు కావడంతో అమృత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే నెపంతో ఈ హింసకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది, అయితే ఇది కేవలం పథకం ప్రకారం జరిగిన హత్యేనని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్లో హిందూ యువకులపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే దీపూ చంద్రదాస్ అనే మరో హిందూ యువకుడిని కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపి, ఆపై సాక్ష్యాలు దొరక్కుండా తగలబెట్టిన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ హత్యలు అక్కడి హిందూ సమాజంలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి, ప్రభుత్వం నుండి తమకు సరైన రక్షణ కరువైందని వారు వాపోతున్నారు.
ప్రస్తుతం రాజ్బరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మైనారిటీల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వరుస దాడులు ఆగిపోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు జరిగే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa