పంచారామాల వంటి దివ్యక్షేత్రంలోనే ఘోరం జరగడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా విమర్శించారు. ఆలయాల భద్రత, నిర్వహణలో వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.పంచారామాల్లో ప్రధాన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామంలో జరిగిన మహాఘోరం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ద్రాక్షారామం ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వరస్వామి గుడిలో ఉన్న పురాతన శివలింగాన్ని ధ్వంసం చేయడం అత్యంత దారుణమైన, క్షమించరాని చర్య. ఈ ఘటనను చంద్రబాబు గారి ప్రభుత్వం మూసివేసే ప్రయత్నం చేస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఆలయాల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచారామాల వంటి దివ్యక్షేత్రాల్లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. దేవాలయాల పరిరక్షణ, సమగ్ర నిర్వహణపై చిత్తశుద్ధి లేకుండా రాజకీయాలు చేయడమే ఈ ప్రభుత్వానికి పరిమితమైందని స్పష్టమవుతోంది.ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ అసాంఘిక శక్తులు తిష్ట వేస్తున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. సరైన భద్రతా వ్యవస్థలు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.గత 19 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో అపచారాలు, దుర్ఘటనలు జరుగుతున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ ధర్మానికి విఘాతం కలిగించే చర్యలను అరికట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ఘోర ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల భద్రతను బలోపేతం చేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa