ఐపీఎల్ 2026 సీజన్ ముందే కోల్కతా నైట్ రైడర్స్కు పెద్ద షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైకియా స్పష్టం చేశారు.
“ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీకి బీసీసీఐ సూచించింది” అని దేవజిత్ సైకియా వెల్లడించారు. డిసెంబర్ 2025లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ ముస్తఫిజుర్ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది.
బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులపై జరిగిన హింసాత్మక ఘటనలు, ఓ హిందూ వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ అంశం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. భారత్ ఇప్పటికే అక్కడ మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేత కౌస్తవ్ బాగ్చీ, కోల్కతాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఆ వ్యాఖ్యల తర్వాత పలువురు నేతలు, మత సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు అయితే కేకేఆర్ కో-ఓనర్ షారుఖ్ ఖాన్ను కూడా టార్గెట్ చేశారు.
ఈ వివాదాలపై బీసీసీఐ ప్రత్యక్షంగా స్పందించకపోయినా, పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సన్నాహకాల్లో ఎలాంటి అదనపు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యగా బోర్డు భావిస్తోంది. క్రికెట్ పరంగా చూస్తే, ఈ నిర్ణయం కేకేఆర్ బౌలింగ్ విభాగానికి దెబ్బే. స్లో పిచ్లపై తన వెరైటీలతో ప్రత్యర్థులను కట్టడి చేసే ముస్తఫిజుర్ కీలక పాత్ర పోషిస్తాడని భావించారు. అయితే, అతడిని విడుదల చేసిన నేపథ్యంలో రిప్లేస్మెంట్ ప్లేయర్ను తీసుకునే అవకాశం కేకేఆర్ ఉంటుందని బీసీసీఐ భరోసా ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa