ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేము టీ20 వరల్డ్ కప్ భారత్‌లోనే ఆడతాం!'.. దెబ్బకు దారికొచ్చిన బంగ్లాదేశ్

sports |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 11:44 PM

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీని వల్ల వివాదం తలెత్తి బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్యలో దూరడంతో పెద్దదైంది. దీంతో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తాము భారత్‌లో పర్యటించబోమని బంగ్లాదేశ్ గత కొద్ది రోజులుగా చెబుతోంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని అంటోంది. అందుకోసం ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని ఐసీసీకి కూడా లేఖలు రాసి.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే దీనిపై ఐసీసీ తీవ్రంగా స్పందించిందని వార్తలు రావడంతో.. తోకముడిచి తాము భారత్‌లోనే టీ20 వరల్డ్ కప్ ఆడతాం అని తెలిపింది!


భారత్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో.. బంగ్లాదేశ్ చేసిన డిమాండ్‌పై ఐసీసీ కఠిన వైఖరి అవలంభించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దాని ప్రకారం.. ఐసీసీ ఛైర్మన్ జై షా నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో.. భద్రతా కారణాలంటూ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చడం సాధ్యం కాదని బీసీబీకి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడం సభ్య దేశాల బాధ్యత అని.. భారత్‌కు రాకపోతే పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దారిలోకి వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.


కాగా, తమ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తిరస్కరించిందన్న వార్తలను బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఖండించింది. ఐసీసీ తమకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని చెప్పింది. అయితే తమ విజ్ఞప్తిపై ఐసీసీ స్పందించిందని.. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌ల నేపథ్యంలో.. తమ ప్లేయర్ల సెక్యూరిటీపై తాము లేవెనెత్తిన అంశాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుందని బీసీబీ తెలిపింది. మ్యాచ్‌ల వేదికలను మార్చాలనే తమ విజ్ఞప్తిపై కూడా.. అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ బదులిచ్చిందని చెప్పింది.


ఆటగాళ్ల భద్రత విషయంలో తమతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు బీసీబీ పేర్కొంది. ఇక ఐసీసీతో పాటు ఈవెంట్‌ నిర్వహిస్తున్న దేశాల బోర్డులతో కూడా.. బీసీబీ ప్రొఫెషనల్‌గానే ముందుకు సాగుతుందని.. వరల్డ్‌కప్‌లో మేము తప్పక పాల్గొంటామని చెప్పింది. ఏదేమైనా బంగ్లాదేశ్ ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని బీసీసీ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీని భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa