ఇటీవల వెనుజులా రాజధాని కరాకస్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో.. అమెరికా బలగాలు ఈ దాడులకు పాల్పడ్డాయి. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేసినట్లు వెనుజులా ఆరోపించింది. దీంతో వెనుజులా సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పింది. అయితే దాడులు ప్రారంభించిన కొద్దిసేపటికే.. వెనుజులా సైనికులపై.. అమెరికా బలగాలు పైచేయి సాధించాయని వార్తలు వాచ్చాయి. తాజాగా అమెరికా ఒక మిస్టరీ ఆయుధం ఉపయోగించి ఉంటుందని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా కస్టడీలో ఉన్న వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు నమ్మకస్తుడైన సెక్యురిటీ గార్డ్ ఎక్స్ పోస్టును.. అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ షేర్ చేశారు. ఇది చదవండి అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు.
"ఇదివరకు ఎన్నడూ చూడని అత్యాధునిక ఆయుధమేదో అమెరికా ఉపయోగించింది. ఒక భారీ శబ్ధం వంటి ఫోర్స్ ఏదో వచ్చింది. దీంతో క్షణాల్లో సైనికులను నిస్సత్తువ ఆవహించింది. మేము మా పని చేస్తుండగానే.. వెనుజులా రాడార్లు అన్నీ.. కారణమేంటో తెలియజేకుండా అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఆ వెంటనే కుప్పలు తెప్పలుగా డ్రోన్లు.. వెనుజులా స్థావరాలపైనుంచి వెళ్లాయి. ఆ క్షణంలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఆయుధాలు మేము ఇంతకుముందు ఎదుర్కొన్నవిగా అనిపించలేదు" ఆ పోస్టులో ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
'అది యుద్ధం కాదు మారణకాండ'
ప్రత్యక్ష సాక్షి అమెరికా దాడులను ఒక మారణకాండగా అభివర్ణించాడు. అమెరికా దళాల వేగాన్ని, కచ్చితత్వాన్ని.. వెనుజులా సైనికులు తట్టుకోలేకపోయారన్నాడు. న్యూయార్క్ పత్రిక కథనం ప్రకారం.. కేవలం ఎనిమిది హెలికాప్టర్లలో 20 అమెరికా ట్రూప్స్ వచ్చాయి. అయితే వెనుజులా సైనికులు వందల మంది ఉన్నా.. వారిని ఏం చేయలేకపోయామన్నాడు ప్రత్యక్ష సాక్షి. వారు జరిపిన కాల్పులు చూసి.. ఒక్కో సైనికుడు నిముషానికి 300 రౌండ్లు కాల్పులు జరిపుతున్నట్లు అనిపించిందన్నాడు. ఈ క్రమంలో అమెరికా ఒక మిస్టరీ ఆయుధం వాడి ఉంటుందని సాక్షి చెప్పాడు.
"ఒక సందర్భంలో అమెరికా సైనికులు ఏదో ఆయుధాన్ని ప్రయోగించారు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ అది పెద్ద సౌండ్ వేవ్లాగా ఉంది. దీంతో నా తల లోపలి నుంచి బద్దలైనట్లు అనిపించింది. ఆ వెంటనే మా ముక్కుల్లోంచి రక్తం వచ్చింది. కొంతమంది వెనుజులా సైనికులు నెత్తురు వాంతులు చేస్తున్నారు. మేమంతా కింద పడి.. ఎటూ కదల్లేకపోయాము. అది సోనిక్ ఆయుధమో ఏమో గానీ.. అది ప్రయోగించిన తర్వాత నిలబడలేకపోయాము" అని ప్రత్యక్ష సాక్షి చెప్పుకొట్టాడు.
ప్రత్యక్ష సాక్షి చెప్పినదాని ప్రకారం అమెరికా.. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఉపయోగించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆయుధాలు అమెరికా వద్ద దశాబ్దాలుగా ఉన్నాయంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం స్పందించలేదు. ఈ క్రమంలో అమెరికా ఎలాంటి ఆయుధం ఉపయోగించి ఉండవచ్చు అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa