భారత క్రికెట్ చరిత్రలో మ్యాచ్ విన్నర్ అంటే ముందుగా గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. అలాంటి కింగ్ కోహ్లికి లభించిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కూడా లెక్కలేనన్ని. కానీ ఆ అవార్డులు తన వద్ద పెట్టుకోకుండా, అమ్మ దగ్గరకు పంపిస్తానని చెప్పి మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు కోహ్లీ.
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, 93 పరుగులతో జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ, అతడి ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రదానోత్సవంలో మాట్లాడిన కోహ్లీ, తన మనసులోని మాటలను ఓపెన్గా చెప్పాడు.
“ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అన్నీ నేను గురుగావ్లో ఉన్న నా అమ్మ దగ్గరకే పంపిస్తాను. ఆమెకు అవి ఇంట్లో పెట్టుకోవడం చాలా ఇష్టం. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే, ఇది నిజంగా కలలాంటిదే. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు, దాని కోసం ఎంత కష్టపడ్డానో కూడా తెలుసు. దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అందుకు నా మనసంతా కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుంది” అని కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
అంతర్జాతీయ స్థాయిలో టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నప్పటికీ.. వన్డే ఫార్మాట్లో కోహ్లీ ఇప్పటికీ భారత జట్టుకు మెయిన్ పిల్లర్గా కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అదే ఫిట్నెస్, అదే ఆట తీరుతో పరుగులు రాబడుతున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న ఈ సిరీస్లో కూడా కోహ్లీ నుంచి మరిన్ని భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు అభిమానులు.
టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లి మొదటిసారి ఆస్ట్రేలియా వన్డే సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో సెంచరీ నమోదు చేసిన కోహ్లి, మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. ఇప్పుడు న్యూజిలాండ్తో తొలి వన్డేలోనే 93 పరుగులతో మరో సెంచరీని మిస్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లి ఫామ్ చూస్తుంటే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027లోనూ ఇదే జోష్ కొనసాగించేలా కనిపిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa