భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. వడోదరలోని బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వన్డే క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు.
301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్, ఆరో ఓవర్లో బెన్ ఫౌల్క్స్ బౌలింగ్లో తొలి సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో కైల్ జేమిసన్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిని స్టాండ్స్లోకి పంపి మరో భారీ షాట్ కొట్టాడు. ఈ సిక్సర్తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇది మరో చారిత్రక ఘట్టం కావడం విశేషం. అయితే మంచి ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్గా మార్చుకోలేకపోయిన రోహిత్, తొమ్మిదో ఓవర్లో జేమిసన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్తో వన్డేల్లో ఓపెనర్గా రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 329కి చేరింది. దీంతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 328 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇప్పటికే గతేడాది దక్షిణాఫ్రికా సిరీస్లో షాహిద్ అఫ్రిదీ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది కూడా రోహిత్ అద్భుత ఫామ్లో కొనసాగాడు. 14 వన్డే మ్యాచ్ల్లో 650 పరుగులు చేసి, ఒకసారి నాటౌట్గా నిలిచాడు. గతేడాది అత్యుత్తమ స్కోర్ 121. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే వడోదరా వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 93 పరుగులతో పాటు గిల్, అయ్యర్ రాణించడంతో టీమిండియా 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa