చంద్రబాబు, రేవంత్రెడ్డిల మెప్పుకోసం మంత్రి పయ్యావుల కోసం పాకులాడుతున్నారని, అందులో భాగంగానే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును థెఫ్టు ప్రాజెక్టు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని సంతృప్తి పరచడం కోసం ఒక పద్ధతి ప్రకారం రాయలసీమ ప్రాంతానికి సంజీవని లాంటి ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అసలు పనులే మొదలు కాలేదన్న కూటమి నాయకులు.. వైయస్ఆర్సీపీ ప్రాజెక్టు వీడియోలు, ఫొటోలు విడుదల చేశాక మాట మార్చి సాగునీటి ప్రాజెక్టు అని కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అనుమతులు వచ్చే వరకు వేచి చూడకుండా సాగునీటి ప్రాజెక్టు పేరుతో మొదలు పెడతారన్న విషయం తెలిసి కూడా ప్రజలను మాయ చేసేందుకు కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విషప్రచారం మొదలుపెట్టారని వివరించారు. తెలంగాణలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కూడా సాగునీటి ప్రాజెక్టుగానే మొదలైందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎలాగోలా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలు మేలు చేయాలని ఆలోచించకుండా మన ప్రాజెక్టులను మనమే ఆపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మాణం జరుపుకొంటున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసులను ఎత్తివేయించుకోవడానికి పెద్ద పెద్ద లాయర్లను నియమించుకుని వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తున్న చంద్రబాబు, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాదనలు వినిపించడానికి కనీసం లాయర్లను కూడా నియమించలేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa