ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారి ఆల‌యంలో వ‌రుస అప‌చారాలు జరుగుతుంటే ప్రభుత్వం మౌనం వహించడం బాధాకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 10:01 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలు వరుస అపచారాలకు వేదికలుగా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు తీవ్రంగా మండిపడ్డారు.  అమ్మవారి ఆల‌యంలో వ‌రుస అప‌చారాలు, వివాదాలే తప్ప భక్తులకు భద్రత, గౌరవం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ రెండింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధిపతి అయినప్పటికీ ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం మౌనం వహించడం బాధాకరమని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, “ఇన్ని ఘటనలు జరిగినా ఇప్పటివరకు మౌనం వహించాం. కానీ భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోం. అమ్మవారి గుడిలో మూడు గంటలు విద్యుత్ నిలిచిపోయిన ఘటనపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు?” అని నిలదీశారు. గోశాలలను ఆలయ పరిసరాల నుంచి తొలగించడం, ప్యాకెట్ పాలతో అభిషేకాలు చేయడం సంప్రదాయ విరుద్ధమని అన్నారు. అన్నదానం సక్రమంగా జరగడం లేదని, దేవాలయాల్లో అర్చకులు, పురోహితులకు రక్షణ లేకుండా పోయిందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. “అయినవిల్లిలో పూజారిపై కొడవలితో దాడి జరిగి ఆయన కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్చకులు, పురోహితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ప్రభుత్వం తీసుకురాకపోతే వైయస్‌ఆర్‌సీపీ తీసుకువస్తుంది” అని హెచ్చరించారు. దేవస్థాన భూములపై కన్నేసి జీవో నెంబర్‌ 15 పేరుతో విలువైన ఆస్తులను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని, ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఇద్దరు నేతలు డిమాండ్ చేశారు. దేవుడి భూములకు, దేవుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ, కనకదుర్గ ఆలయాన్ని అపచారాల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa