ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 06:42 AM

ఇరాన్‌లో గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతు ప్రకటించారు. ఆందోళనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. "త్వరలోనే మీకు సహాయం అందుతుంది" అంటూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు.దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా మొదలైన ఈ నిరసనలు, ప్రస్తుతం అక్కడి మతపరమైన పాలనకు పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో, ఆందోళనల్లో సుమారు 2,000 మంది మరణించారని ఓ ఇరాన్ ఉన్నతాధికారి మంగళవారం రాయిటర్స్‌తో మాట్లాడుతూ తొలిసారి అధికారికంగా అంగీకరించారు. ఈ మరణాలకు 'ఉగ్రవాదులే' కారణమని, మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.కాగా, నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వ అణచివేతను నిరసిస్తూ, ఆ దేశ అధికారులతో తలపెట్టిన అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. నిరసనకారులపై హత్యలు ఆగే వరకు ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరపబోనని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశంపై అయినా 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని సోమవారం హెచ్చరించారు. ఇరాన్ నుంచి చైనా, భారత్, టర్కీ, యూఏఈ వంటి దేశాలు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa