ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుంటామన్న కెప్టెన్

sports |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 06:55 AM

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (124) అద్భుత శతకంతో పోరాడినా ఫలితం దక్కలేదు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ తమ ప్రదర్శన నిరాశపరిచిందని అంగీకరించాడు. "మేం ఆడిన తీరు తీవ్ర నిరాశ కలిగించింది. కొన్ని అంశాలపై దృష్టి పెట్టి, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్ అద్భుతంగా ఉందని, యువ ఆటగాళ్లు నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా రాణించారని ప్రశంసించాడు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నితీశ్ రెడ్డి లాంటి యువకులకు మరిన్ని అవకాశాలు ఇస్తామని గిల్ స్పష్టం చేశాడు. కాగా, 2010 తర్వాత భారత జట్టు స్వదేశంలో వన్డే సిరీస్ ఓడిపోవడం ఇది ఐదోసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) సెంచరీలతో చెలరేగడంతో 8 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ విఫలమవడంతో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (53)తో కలిసి ఐదో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. చివర్లో హర్షిత్ రాణా (52) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa