ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ కొరియా ఎగుమతులపై టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 03:26 PM

దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించడంలో దక్షిణ కొరియా శాసనసభ విఫలమైందని ఆరోపిస్తూ.. ఆ దేశ ఎగుమతులపై టారిఫ్‌లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఆందోళన మొదలైంది.తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఈ మేరకు పోస్ట్ చేసిన ట్రంప్, సుంకాలను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆటోమొబైల్స్, కలప, ఫార్మా ఉత్పత్తులతో పాటు పలు ఇతర వస్తువులకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. "అమెరికాతో చేసుకున్న ఒప్పందానికి దక్షిణ కొరియా కట్టుబడి ఉండటం లేదు. వారి శాసనసభ ఎందుకు దానిని ఆమోదించలేదు?" అని ట్రంప్ ప్రశ్నించారు. అయితే, సోమవారం రాత్రి వరకు ఈ పెంపునకు సంబంధించి వైట్‌హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.ట్రంప్ ఆకస్మిక ప్రకటనపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం (చియాంగ్ వా డే) స్పందించింది. టారిఫ్‌ల పెంపుపై తమకు అమెరికా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు అధ్యక్ష విధాన డైరెక్టర్ కిమ్ యోంగ్-బియోమ్ మంగళవారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించినట్లు వెల్లడించింది. అలాగే, కెనడా పర్యటనలో ఉన్న వాణిజ్య మంత్రి కిమ్ జంగ్-క్వాన్ వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లి వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్‌తో చర్చలు జరపనున్నట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa