ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదన

national |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 04:57 PM

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్, దేశ వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. గత దశాబ్ద కాలంగా సాధించిన స్థిరమైన ఆర్థిక ప్రగతిని కొనసాగిస్తూ, తయారీ, మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రత, సామాజిక సంక్షేమం వంటి కీలక రంగాలను బలోపేతం చేసే దిశగా ఈ బడ్జెట్‌లో సంస్కరణలు, పెట్టుబడులను జోడించారు. యువత ఆలోచనలకు పెద్దపీట వేస్తూ 'వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026' నుంచి వచ్చిన పలు సూచనలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చడం విశేషం.ప్రభుత్వ మూలధన వ్యయాన్ని  రికార్డు స్థాయిలో రూ. 12.2 లక్షల కోట్లకు పెంచారు. ఇది జీడీపీలో 4.4 శాతంతో గడిచిన పదేళ్లలో అత్యధికం. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ఇచ్చే ప్రత్యేక సహాయాన్ని  23% పెంచి రూ. 1.85 లక్షల కోట్లకు చేర్చారు.తూర్పున డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్  ఏర్పాటు చేయనున్నారు. రైలు, రోడ్డు మార్గాల నుంచి జలమార్గాలకు రవాణాను ప్రోత్సహించేందుకు 'కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్'ను ప్రవేశపెట్టారు.రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను సమీకృతంగా అభివృద్ధి చేసి మత్స్య పరిశ్రమ వృద్ధికి చేయూతనివ్వనున్నారు.ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మధ్య ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.'సిటీ ఎకనామిక్ రీజియన్స్'  అభివృద్ధిలో భాగంగా ఐదు నగరాలకు ఐదేళ్లలో ఒక్కో ప్రాంతానికి రూ. 5,000 కోట్లు కేటాయించనున్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీల కోసం ఐదు కీలక పరిశ్రమల్లో ఐదేళ్ల కాలానికి రూ. 20,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారువ్యవసాయ రంగంలో కొబ్బరి, గంధం, జీడిపప్పు, బాదం వంటి అధిక విలువైన పంటల సాగును ప్రోత్సహించనున్నారు. పాత చెట్లను మార్చి ఉత్పాదకతను పెంచేందుకు 'కోకోనట్ ప్రమోషన్ స్కీమ్'ను ప్రారంభించనున్నారు. 2030 నాటికి జీడిపప్పు, కోకో రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు 'భారత్-విస్తార్' అనే ఏఐ ఆధారిత సాధనాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది అగ్రిస్టాక్ పోర్టళ్లు, ఐకార్ విధానాలను అనుసంధానించి రైతులకు వ్యక్తిగత సలహాలు అందిస్తుంది.గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం కమ్యూనిటీ యాజమాన్యంలో నడిచే 'షీ-మార్ట్స్'  ఏర్పాటు చేస్తారు.


దివ్యాంగులకు ఐటీ, ఏవీజీసీ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 'కౌశల్ యోజన', సహాయక పరికరాల కోసం 'సహారా యోజన' పథకాలను ప్రకటించారు.మానసిక ఆరోగ్య మౌలిక సదుపాయాలను విస్తరించనున్నారు. ఉత్తర భారతదేశంలో కొత్తగా నిమ్హాన్స్-2 ఏర్పాటు చేయడంతో పాటు రాంచీ, తేజ్‌పూర్‌లోని సంస్థలను అప్‌గ్రేడ్ చేస్తారు. జిల్లా ఆసుపత్రుల్లో అత్యవసర, ట్రామా కేర్ సామర్థ్యాలను 50% పెంచనున్నారు.ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. దుర్గాపూర్‌లో ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్, ఐదు పర్యాటక ప్రాంతాలు, 4,000 ఇ-బస్సులను కేటాయించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం వంటి రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్‌లను కూడా అభివృద్ధి చేయనున్నారు.ఆర్థిక రంగంలో సంస్కరణల కోసం 'వికసిత భారత్ కోసం బ్యాంకింగ్‌పై ఉన్నత స్థాయి కమిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా, లిస్టెడ్ కంపెనీలలో విదేశాల్లో నివసించే భారతీయుల  పెట్టుబడి పరిమితులను విస్తరించారు.2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5% కంటే తక్కువకు తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.4 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa