ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 11:48 AM

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం దారుణమ‌ని, చంద్ర‌బాబు రాష్ట్రాన్ని ఆటవిక ప్రదేశ్‌గా మార్చారని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ఆయ‌న ప‌లాస‌లో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా ఉప‌యోగించి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయించారు. నిన్న‌టి ఘ‌ట‌న చంద్రబాబు పాలనలో నెలకొన్న ఆటవిక పరిస్థితులకు నిదర్శనం. లడ్డూ అంశంపై సీబీఐ, సిట్ ఇచ్చిన నివేదికలను కూడా తప్పుబడుతూ, నిజాలు బయటపడినా కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆరోప‌ణ‌లు  చేసేది చంద్రబాబే, కేసులు పెట్టేది కూడా ఆయనే, దర్యాప్తు కూడా ఆయనే, తీర్పు చెప్పేది కూడా ఆయనే. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఈ చంద్రబాబుకు నచ్చడం లేదు. ఫ్లెక్సీలు కడితే గొడవలు జరుగుతాయని తెలిసినా కూట‌మి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ల‌డ్డూ క‌ల్తీ అంటూ గుంటూరులో కూట‌మి నేత‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు క‌రెక్ట్ కాద‌ని అంబటి రాంబాబు మాట్లాడారు.  గతంలో తాలిబాన్ల పాలన ఉండేది. ఇప్పుడు ఏపీలో తాలిబాన్ల పాలనను చంద్రబాబు ప్రభుత్వంలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక ప్రదేశ్‌గా మార్చారు. నిన్న గుంటూరులో పచ్చమూకలు కర్రలు, రాళ్లతో అంబటి రాంబాబు ఇంటిపై ముక్కుమ్మడి దాడి చేశారు. కార్లు, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు.అంబటి రాంబాబు నిన్న మాట్లాడిన మాట‌లు వేడి మీద మాట్లాడిన‌వే. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నవి కావని ఆయనే స్పష్టం చేశారు. ఇటీవ‌ల పలాస ఎమ్మెల్యే గౌతు శీరిషా వైఎస్సార్‌సీపీ నేత‌ను బాస్ట‌ర్డ్ అని దూషించారు. ఈ రెండేళ్లుగా వైయస్ జగన్‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను, వైఎస్సార్‌సీపీ నేత‌ల వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ్డారు.  చంద్రబాబు, లోకేష్ రెండేళ్లుగా దావోస్ వెళ్తున్నారు. కానీ రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకురాలేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన పరిశ్రమలను తమవిగా చెప్పుకోవడం దుర్మార్గం. రాష్ట్రంలో మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? . రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేధావులు, యువకులపై ఉంది. ప్రతి యువకుడు ఒక సైనికుడిలా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa