అగ్రరాజ్యం అమెరికా- భారత్ల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే, ఈ డీల్కు ముందు ఇరుదేశాలకు ఉన్నతస్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన కీలక భేటీకి సంబంధించిన ఓ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వాణిజ్య ఒప్పందం కోసం అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్బర్గ్ సంచలన కథనం వెలువరించింది దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం.. గతేడాది సెప్టెంబరు మొదట్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య సమావేశం జరిగింది. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా వైట్హౌస్ అధికారులు పలువురు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, సుంకాల విషయంలో పలుసార్లు బెదిరింపులకు దిగిన సంగతి కూడా తెలిసిందే. అయితే, రూబియోతో భేటీలో భారత్ తన వైఖరిని కుండబద్దలుకొట్టడమే కాదు, అమెరికాకు చురకలు అంటించింది.
‘ట్రంప్, ఆయన యంత్రాంగం బెదిరింపులకు భారత్ భయపడదు.. వాణిజ్య ఒప్పందం కోసం అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు కూడా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నాం’ అని రూబియోతో దోవల్ చెప్పినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది.
అంతేకాదు, తమపై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరుదేశాలకు మంచిదని, సంబంధాలు మళ్లీ పునరుద్దరణ జరుగుతుందని దోవల్ స్పష్టం చేశారు. ఈ సమావేశం తర్వాత కొద్ది రోజులకే భారత్- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రధానికి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. మోదీపై ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ భేటీ గురించి అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి స్పందిస్తూ... అనధికారిక చర్చల గురించి వివరాలు బయటకు వెల్లడించలేమని తెలిపారు. మరోవైపు, దీనిపై భారత్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు, భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి తొలుత డొనాల్డ్ ట్రంప్ నుంచే ప్రకటన వచ్చింది. ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని, తమ దిగుమతులపై భారత్ సున్నా సుంకాలకు అంగీకరించిందని తెలిపారు. అంతేకాదు, వ్యవసాయం, పాడి పరిశ్రమల ఉత్పత్తులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేస్తామని భారత్ తమకు హామీ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa