ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. రూ.3,32,205 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్, రాష్ట్రాన్ని 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు బలమైన పునాది వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న 'వికసిత్ భారత్ 2047'లో ఏపీని కీలక భాగస్వామిని చేస్తుందని, 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్యాన్ని చేరుకునేలా నడిపిస్తుందని పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ బడ్జెట్ ఒక సమతుల్య గ్రోత్ మోడల్గా రూపుదిద్దుకుందని పవన్ కల్యాణ్ కొనియాడారు. గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత వంటి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లేలా ఈ బడ్జెట్ ఉందని అన్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలను సమాజంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతతో అందించాలనే లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.ముఖ్యంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఏకంగా రూ.22,942 కోట్లు కేటాయించడం శుభపరిణామమని పవన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలే కీలకమనే విషయాన్ని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందని తెలిపారు. ఈ కేటాయింపులతో గ్రామీణ మౌలిక సదుపాయాలు, రహదారుల నిర్మాణం, ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు స్థానిక పాలనను బలోపేతం చేసి గ్రామాల ఆర్థిక పరిపుష్టికి దోహదపడతాయని వివరించారు.అదేవిధంగా పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.714 కోట్లు కేటాయించడం ద్వారా 'హరిత ఆంధ్రప్రదేశ్' లక్ష్య సాధన పట్ల ప్రభుత్వ నిబద్ధత స్పష్టమవుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. 2030 నాటికి 37 శాతం, 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ సాధించే దిశగా ఈ నిధులు ఉపయోగపడతాయని, అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు మరింత చేయూత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమగ్ర బడ్జెట్ను రూపొందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడులకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa