డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఊచకోత కోసింది. పల్లెకెలె గ్రౌండ్ సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల మోత మోగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ అద్భుత ఆరంభం ఇవ్వడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేయగలిగింది. షాహిబ్జాదా ఫర్హాన్ ఈ టోర్నీలో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. 59 బంతుల్లోనే సెంచరీ చేసి టీ20 వరల్డ్కప్ హిస్టరీలోనే ఒకే టోర్నీలో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లు పూర్తిగా విఫలమైన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ అవుటైన తర్వాత నుంచి పాక్ స్కోర్ బోర్డు నెమ్మదించడం గమనార్హం. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించాలంటే శ్రీలంకను 140 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంటుంది.
పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు పాకిస్తాన్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. భారీ పరుగుల తేడాతో గెలవాల్సిన ఈ మ్యాచ్ను పాకిస్తాన్ అద్భుతంగా ఆరంభించారు. పవర్ ప్లేలో వికెట్ పడకుండా 64 పరుగులు చేసిన పాకిస్తాన్ ఓపెనర్లు, ఆ తర్వాత ఇంకాస్త రెచ్చిపోయారు. శ్రీలంక బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో పది ఓవర్లలోపే వంద పరుగులు పూర్తి చేసింది.
షాహిబ్జాదా ఫర్హాన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన ఫర్హాన్ టీ20 వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్ల సరసన నిలిచాడు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో విరాట్ కోహ్లి 321 పరుగులతో ఇప్పటి వరకు హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా ఉండగా, ఫర్హాన్ ఆ రికార్డును బద్దలకొట్టాడు. పవర్ ప్లే తర్వాత దూకుడు పెంచిన ఫఖర్ జమాన్ రెచ్చిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో కేవలం 27 బంతుల్లోనే ఫఖర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రెండోసారి డ్రింక్ బ్రేక్ సమయానికి 14 ఓవర్లలోనే పాకిస్తాన్ వికెట్ కోల్పోకుండా 150 పరుగులు చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ 46 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ 38 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులతో విధ్వంసం సృష్టించారు. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్లు పోరాట స్ఫూర్తితో రాణించడం విశేషం.
సెంచరీకి అతి దగ్గరగా ఉన్న సమయంలో ఫఖర్ జమాన్ అవుటయ్యాడు. 42 బంతులు ఆడిన ఫఖర్ జమాన్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి దుష్మంత చమీరా బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఖవాజా నఫాయ్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. షాదాబ్ ఖాన్ కూడా 5 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. మొహమ్మద్ నవాజ్ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా డకౌట్ అయ్యాడు. సెంచరీ చేసిన షాహిబ్జాదా ఫర్హాన్ 60 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. కేవలం 31 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa