భారత్తో పాటు టీ20 ప్రపంచకప్ 2026కు సంయుక్త ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంక.. దారుణ ప్రదర్శన చేసింది. సెమీస్ కూడా చేరకుండానే సూపర్-8 దశ నుంచే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు వచ్చే వన్డే ప్రపంచకప్ 2027పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా టీమిండియాకు వన్డే ప్రపంచకప్ 2011 అందించిన దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్స్టన్ను హెడ్ కోచ్గా నియమించింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటన చేసింది.
గత కొన్ని రోజులుగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య.. శ్రీలంక హెడ్ కోచ్గా పనిచేశాడు. అతడి కోచింగ్లో ద్వైపాక్షిక సిరీస్లలో శ్రీలంక సత్తాచాటినా.. ఐసీసీ టోర్నీలో మాత్రం విఫలమైంది. తాజాగా టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 నుంచే నిష్క్రమించింది. ఎన్నో అంచనాలతో ఈసారి ఆ జట్టు బరిలో నిలిచింది. కానీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో జయసూర్య.. కోచ్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది.
కోచింగ్లో సుదీర్ఘ అనుభవమున్నగ్యారీ కిర్స్టన్ ఏప్రిల్ నుంచి లంక కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రెండేళ్ల పాటు అతడు ఈ బాధ్యతల్లో ఉండనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు అతడే లంక హెడ్కోచ్గా ఉండనున్నాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్స్టన్ ఆటగాడిగా సత్తాచాటిన తర్వాత కోచింగ్ ఫీల్డ్లోకి వచ్చాడు 2011లో భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో అతడిది కీలకపాత్ర. ఆ తర్వాత ఐపీఎల్లోనూ హెడ్ కోచ్గా అతడు బాధ్యతలు చేపట్టాడు. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచిందంటే.. అందుకు ప్రధాన కారణం గ్యారీ కిర్స్టన్.
ఐపీఎల్లో కోచింగ్ తర్వాత గ్యారీ కిర్స్టన్.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. అయితే అతడు సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పాక్ విఫలమైంది. దీంతో కొన్ని రోజులకే అతడు బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఇక టీ20 ప్రపంచకప్ 2026లో నమీబియా జట్టుకు కన్సల్టెంట్గా పని చేశాడు. తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. గ్యారీ కిర్స్టన్.. సౌతాఫ్రికా తరఫున 101 టెస్టులు, 185 వన్డేలు ఆడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa