ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13 ఏళ్లుగా కోమాలో,,,కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి

national |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 07:09 PM

దేశ అత్యున్నత న్యాయ స్థానం మరో కీలక తీర్పు చెప్పింది. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడి తలకు తీవ్రగాయమై.. దాదాపు 13 ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఓ యువకుడి కారుణ్య మరణం కేసులో సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సకు నిలిపివేసి, కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. కోమాలో ఉన్న ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించడం దేశంలో ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన హరీష్ రాణా కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ అతడి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.


వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన హరీష్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్‌‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. అతడు ఉంటోన్న పీజీ నాలుగో ఫ్లోర్‌ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కాగా.. శరీరం కదలలేని స్థితికి చేరుకుంది. హరీష్ తల్లిదండ్రులు తమ కుమారుడ్ని వైద్యం కోసం ప్రముఖ ఆసుపత్రులు చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి కోమాలోనే ఉన్న అతడ్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన వారు ఈ నరకం నుంచి తమ కుమారుడికి విముక్తి కల్పించాలని కోరుతూ 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆ తల్లిదండ్రులకు నిరాశ తప్పలేదు. అయితే, హరీష్ కోలుకునే అవకాశం లేదని మెడికల్ బోర్డ్ నివేదికలు ఇవ్వడంతో మరోసారి సుప్రీం తలుపు తట్టారు. వైద్యుల నివేదికలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. పిటిషన్ విచారణకు అనుమతించింది. ఈ క్రమంలోనే జనవరి 13న హరీష్ రాణా తల్లిదండ్రులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయకోణంలో తమ కుమారుడికి గౌరవప్రమదమైన మరణాన్ని ప్రసాదించాలని వారు వేడుకున్నారు.


ఆ సందర్భంగా లైఫ్ సపోర్ట్ చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామంటూ జస్టిస్ జేబీ వార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెలువరించిన కోర్టు.. అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. ‘‘గత 13 ఏళ్లుగా కోమాలో ఉన్న అతడిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని వైద్య నివేదికలు చెబుతున్నాయి.. రోగిని కాపాడటమే డాక్టర్ విధి. కానీ, అతడు కోలుకునే అవకాశం లేనప్పుడు ఆ విధి నిర్వర్తించడం నిష్ప్రయోజనం అవుతుంది. అతడి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా లైఫ్ సపోర్ట్ చికిత్సను నిలివేసే బాధ్యత ఎయిమ్స్‌ చూసుకుంటుంది. ఒకరిని ప్రేమించడం కంటే కష్టకాలంలో వారికి తోడుగా ఉండటమే. హరీష్ రాణా కుటుంబం ఎప్పుడూ అతడి వెంటే ఉంది. జీవితం, ప్రేమ, నష్టం వీటిని పక్కనపెడితే.. వాస్తవాల ఆధారంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది.


‘‘జీవితాన్ని అంగీకరిస్తున్నారా? అని ఏ మనిషీని దేవుళ్లు అడగరు.. అది నువ్వే తీసుకోవాలి’’ అని కారుణ్య మరణాన్ని ఓ ఎంచుకోవచ్చా అని కోర్టులు అడిగినప్పుడు (అమెరికా మంత్రి) హెన్రీ (వార్డ్ బీచర్) చెప్పిన మాటలు ఇవి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విలియం షేక్‌స్పియర్ హామ్లెట్ నవలలోని ‘ఉండాలా? వద్దా?’ అనే పదబంధాన్ని ఉటంకిస్తూ ‘చనిపోయే హక్కు’ను నిర్ణయించడానికి దీనిని ఉపయోగిస్తున్నారని జస్టిస్ జేబీ పార్దీవాలా అన్నారు.


2011లో అరుణ షాన్‌బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అసాధారణ పరిస్థితులలో దేశంలో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశారు. లైంగిక దాడి గురైన ఆమె పక్షవాతంతో నాలుగు దశాబ్దాలకు పైగా కోమాలోనే ఉండిపోయారు. ఆమె కోలుకుంటారనే ఆశలేదని వైద్య నివేదికలు పేర్కొనడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఈ తీర్పు అసాధారణ సందర్భాలలో కారుణ్య మరణానికి నిబంధనలను సడలించి, దీనిని అనుమతించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa