ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో చమురు ఉత్పత్తి తగ్గుతోంది, దీంతో సరఫరా నిలిచిపోవడంతో భారత్ దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లపై భారత్ పరిమితులు విధించింది. దీంతో తమిళనాడులోని రెస్టారెంట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్పీజీని ఆదా చేసే ప్రయత్నంలో అనేక హోటళ్లు, ఈటరీలు ఇప్పటికే తమ మెనూలలో వంటకాల సంఖ్యను తగ్గించడం ప్రారంభించాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రధాన చమురు కంపెనీల డీలర్లు 22 కిలోలు, 32 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల కోసం చేస్తోన్న అత్యవసర అభ్యర్థనలను తిరస్కరిస్తున్నారని చెన్నై హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ‘మేము 24 గంటలూ పని చేస్తాం.. నిరంతర సేవ కోసం గ్యాస్ సిలిండర్ల నిరంతర సరఫరా అవసరం’ అని అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి అన్నారు. దీర్ఘకాలిక కొరత రెస్టారెంట్ల నుంచి ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఐటీ కంపెనీ క్యాంటీన్లకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఈ వార్తలను ఎలా తెలియజేయాలని హోటళ్లు డైలామాలో ఉన్నాయి. ‘‘రేపు మాకు ఒక కార్యక్రమం ఉంది.. కస్టమర్ 300 మంది అతిథులకు ఆర్డర్ ఇచ్చారు.. సంక్షోభం గురించి మేము వారికి చెప్పలేదు. మేము దానిని ఎలా డెలివరీ చేస్తామో మాకు తెలియదు’’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక హోటల్ యజమాని అన్నారు.
ప్రభుత్వ జోక్యం, నిరంతర సరఫరాను పునరుద్ధరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సందేశం పంపిన తమిళనాడు హోటల్స్ అసోసియేషన్.. దీనిపై ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్తో అత్యవసర అపాయింట్మెంట్ కోరింది. చిన్న ఈటరీలు రోజుకు మూడు నుంచి ఐదు 19 కిలోల వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 100-200 సీటింగ్ సామర్థ్యం కలిగిన మధ్య తరహా హోటళ్లకు ప్రతిరోజూ కనీసం ఐదు నుంచి 10 సిలిండర్లు అవసరమవుతాయి. బోర్డింగ్, లాడ్జింగ్ అందించే త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటల్స్2కు కనీసం 20 సిలిండర్లు అవసరం.‘మేము నెలల తరబడి సిలిండర్లను నిల్వ చేయలేమని, చాలా హోటళ్లు ఈ అర్ధరాత్రి వరకు మాత్రమే నడుస్తాయి. కొన్నింటిలో బుధవారం వరకు తగినంత స్టాక్ ఉంది’ అని ఆయన రవి చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి అనేక హోటల్ మెనూలను అవసరమైన వస్తువులకే పరిమితం చేయడం, ఆపరేటింగ్ గంటలను తగ్గించడం, రైస్, ఇడ్లీలు వంటి వంటకాల కోసం ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం వంటి అంతర్గత అత్యవసర చర్చలు జరుపుతున్నాయి. అడయార్ ఆనంద్ భవన్ ఇప్పటికే గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే తండూరి, దాల్ మఖానీ, రవ్వ దోశ, ఇతర ఉత్తరాది వంటకాలను తొలగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa