బెస్ట్ ఫీచర్లు, అద్భుతమైన కెమెరాలతో కొత్త మొబైల్ ఎప్పుడు వస్తుందా అని టెక్ లవర్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వినియోగదారుల కోసం ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా ‘షియోమీ 17’ సిరీస్ను విడుదల చేసింది. ఇందులో షియోమీ 17 మరియు షియోమీ 17 అల్ట్రా అనే రెండు ప్రీమియం మోడళ్లు ఉన్నాయి. అత్యాధునిక ప్రాసెసర్, ప్రొఫెషనల్ కెమెరాలతో రూపొందించిన ఈ ఫోన్లు మొబైల్ ఫొటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని కంపెనీ చెబుతోంది.ఈ సిరీస్లోని షియోమీ 17 మోడల్ చేతిలో పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో 6.3 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను అందించారు. వినియోగానికి అనుగుణంగా ఈ స్క్రీన్ 1Hz నుంచి 120Hz వరకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ మార్చుకుంటుంది. దీంతో బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో పాటు HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఫోన్ను మరింత బలంగా ఉంచేందుకు షీల్డ్ గ్లాస్ 3.0 ప్రొటెక్షన్ను అందించగా, దుమ్ము మరియు నీటిని తట్టుకునేలా IP68/69 రేటింగ్ కూడా ఇచ్చారు. హైపర్ OS 3పై పనిచేసే ఈ ఫోన్లో అత్యంత వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ను వాడారు. ఇందులో 12GB ర్యామ్తో పాటు 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరా పరంగా చూస్తే వెనుక భాగంలో మూడు 50MP సెన్సార్లు ఉన్నాయి. లైట్ ఫ్యూజన్ 950 ప్రైమరీ సెన్సార్తో మంచి ఫోటోలు తీసుకోవచ్చు. పోర్ట్రెయిట్ షాట్స్ కోసం టెలిఫోటో లెన్స్, వైడ్ యాంగిల్ ఫోటోల కోసం అల్ట్రా-వైడ్ లెన్స్ ఇచ్చారు. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్లో 6,330mAh భారీ బ్యాటరీను అమర్చారు. ఇది 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించిన మరో మోడల్ షియోమీ 17 అల్ట్రా. ఇందులో 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లేను అందించారు. రెండు మోడళ్లలో ప్రాసెసర్ ఒకటే అయినప్పటికీ, ఈ అల్ట్రా వేరియంట్లో 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ ఫిక్స్డ్గా ఇచ్చారు. ఈ ఫోన్లో లైకా (Leica) ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 50MP లైట్ ఫ్యూజన్ 1050L ప్రైమరీ సెన్సార్తో క్లియర్ ఫోటోలు తీసుకోవచ్చు. జూమ్ ఫోటోగ్రఫీ కోసం 200MP టెలిఫోటో లెన్స్ను కూడా అమర్చారు. దీనికి తోడు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. భారీ కెమెరా మాడ్యూల్ కారణంగా బ్యాటరీ సామర్థ్యం కొద్దిగా తగ్గి 6,000mAhగా ఉంది. అయినప్పటికీ ఇది 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.ధరల విషయానికి వస్తే, ప్రీమియం సెగ్మెంట్లో విడుదలైన షియోమీ 17 బేస్ వేరియంట్ (256GB) ధర రూ.89,999 కాగా, టాప్ వేరియంట్ (512GB) ధర రూ.99,999గా నిర్ణయించారు. లాంచ్ సందర్భంగా ప్రకటించిన ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద బేస్ వేరియంట్ ధరకు టాప్ మోడల్ను పొందే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఇక షియోమీ 17 అల్ట్రా ధర రూ.1,39,999గా ఉంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ రూ.19,999 విలువైన ‘ఫొటోగ్రఫీ కిట్ ప్రో’ను కూడా విడుదల చేసింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ముందుగా అల్ట్రా మోడల్ కొనుగోలు చేసే వారికి ఈ కిట్ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్లు మార్చి 18 నుంచి ఆన్లైన్లో అమెజాన్, Mi.com వెబ్సైట్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న షియోమీ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa