చర్చలకు రమ్మని ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు సరిగా లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు సంబంధించి ఉద్యోగ సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్పై మాట్లాడదామంటేనే తాము వచ్చామని మంత్రులతో సమావేశంలో తెగేసిచెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. జీపీఎస్ గురించి మాట్లాడాలనుకుంటే ఇకపై అసలు చర్చలకే పిలవొద్దని తేల్చి చెప్పినట్టు ప్రకటించారు.
ఈ మేరకు ఏపీసీపీఎస్యూఎస్ అధ్యక్షుడు మరియదాస్ మీడియాతో మాట్లాడుతూ.. తాము సమావేశ గదిలోకి వెళ్లాక మంత్రులు యథాతథంగా జీపీఎస్ విధానం పైనే మాట్లాడదామన్నారని తెలిపారు. అయితే, పాత పింఛన్ విధానంపై మాట్లాడదామంటేనే తాము ఇక్కడికి వచ్చామని.. లేదంటే వచ్చేవాళ్లం కాదని తేల్చిచెప్పామన్నారు. తాము పాత పింఛన్ విధానంపై మాట్లాడదామంటే ‘‘మీరు జీపీఎస్ ట్రాక్లోకి రండి.. దానికి మేం కొంత వెసులుబాట్లకు సిద్ధమే’’ అని మంత్రులు చెప్పారన్నారు. కానీ, పాత పింఛన్ విధానంలోకి వస్తే ఒకట్రెండు వెసులుబాట్లకు తాము కూడా సిద్ధమేనని చెప్పామని వెల్లడించారు.
ప్రభుత్వం తరఫు నుంచి పాత పింఛను విధానానికి వచ్చే అవకాశం ఇసుమంత కూడా లేదని మంత్రులు కూడా స్పష్టం చేశారని మరియదాస్ చెప్పారు. మరి ఆమాత్రం దానికి ఎందుకు ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి.. ఇది కరెక్టు కాదని చెప్పామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, వేలాది సీపీఎస్యూఎస్ నాయకులు, టీచర్లపై పోలీసులు కేసులు పెట్టారని, అక్రమ కేసులు రద్దు చేయాలని కోరినట్టు సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న పోలీసులు తమ ఇళ్లు ముట్టడించారని ఉద్యోగ సంఘాల నేతలు రవికుమార్, దుర్గారావు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్పై బుధవారం మళ్లీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ సూచించింది. 20 మంది ప్రతినిధులను ఈ మేరకు చర్చలకు ఆహ్వానించింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు చర్చలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa