ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తాం..తెరపైకి నితీశ్ కొత్త ప్రతిపాదన

national |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 12:35 AM

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమియే ధ్యేయంగా బిహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో  వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఒకవేళ బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ‘‘ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇస్తాం.. నేను కేవలం బిహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు.. మిగతా అన్ని వెనుకబడిన రాష్ట్రాలూ ప్రత్యేక హోదా పొందుతాయి’’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


నితీశ్ కుమార్ ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా పలు ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశమై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ యంత్రాంగాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు. గత నెలలోనే బిహార్‌లో ఎన్డీయే నుంచి బయటకొచ్చిన నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, 2007 నుంచి బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీశ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను కొన్నిసార్లు ఎన్నికలకు ముందు లబ్ది పొందడానికి, కొన్ని సమయాల్లో మిత్రపక్షం బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు జేడీయూ నేత వ్యూహాత్మకంగా లేవనెత్తారు.


ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే కేంద్ర ప్రయోజిత పథకాల కింద ఇచ్చే నిధులు నిష్పత్తి 90: 10గా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిమ్, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రత్యేక హోదా కల్పించారు.


రాజ్యాంగంలో రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే, 2014లో రద్దుచేసిన ప్రణాళికా సంఘంలో భాగమైన నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అనేక అంశాల ఆధారంగా ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను సిఫార్సు చేసింది. కొండలు, కష్టతరమైన భూభాగం, తక్కువ జన సాంద్రత లేదా గిరిజన జనాభా ఎక్కువగా ఉండి, పొరుగు దేశాలతో సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక స్థానం, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటుతనం వంటి అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంట్‌కు 2018లో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.


14వ ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనే భావన కనుమరుగైంది. అయితే, బీహార్, ఒడిశా, జార్ఖండ్ మాత్రం వెనుకబాటుతనం, పేదరికం కారణాలతో ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రధానమంత్రి పీఠంపై ఆశలేదని నితీశ్ ప్రకటించినప్పటికీ బీజేపీని ఎదుర్కోవడానికి కలిసి వచ్చే ప్రతిపక్ష ఫ్రంట్‌లో తాను కీలమని ఈ ప్రకటనతో చెప్పకనే చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa