ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్ బాటలో బీజేపీ...ఆటోవాలాలతో టీ ఫెన్ బేటీ

national |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 12:35 AM

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో ఆ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ తన పంథాను మార్చుకొంది. కేజ్రీవాల్ బాటలోనే బీజేపీ నేతలు పయనిస్తున్నారు. ఇదిలావుంటే గుజరాత్‌లో ఎన్నికల పుణ్యమా అని ఆటోవాలాల క్రేజ్ పెరిగింది. అక్కడి రాజకీయ నాయకులు పోటీ పడి మరీ ఆటో డ్రైవర్లతో గడుపుతున్నారు. పని గట్టుకుని.. ఆటోవాలాలతో ముచ్చటిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దీనిని మొదలుపెట్టగా.. బీజేపీ నాయకులు దానిని అందిపుచ్చుకున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసం.. ఆటో డ్రైవర్లపై పడ్డారు.


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో డిన్నర్ చేశారు. దాని కోసం అతని ఆటోలోనే కేజ్రీవాల్ వెళ్లారు. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని అడ్డుకున్నా.. తనకు భద్రత వద్దని ఆటోలోనే వెళ్లారు. ఈ విషయంలో బీజేపీ.. కేజ్రీవాల్‌ను తీవ్రంగా విమర్శించింది. ఇదంతా ఎన్నికల స్టంట్ అని ఆరోపించింది. అక్కడితో ఆగకుండా ఆయనకు ఐదు ఆటోలను గిఫ్ట్‌గా కూడా పంపించింది. బీజేపీ ఎమ్మెల్యేలు.. కేజ్రీవాల్ ఇంటి ముందు ఆటో ధర్నా కూడా చేశారు.


దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా రియాక్ట్ అయ్యారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. గుజరాత్ సీఎం కూడా గురువారం ఆటో డ్రైవర్లను కలిసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సూరత్‌లో ఆటో డ్రైవర్లను కలసి వారితో కలసి టీ తాగుతూ.. ముచ్చటించిన ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పోస్ట్‌ను ఆయన ట్వీట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. "గుజరాత్ సీఎం కూడా ఆటో డ్రైవర్లతో టీ తాగబోతున్నారని నేను విన్నాను. మీరు గత 27 ఏళ్లలో ప్రజల గొంతు విని ఉండాలి" అని కేజ్రీవాల్ హిందీలో పేర్కొన్నారు.


మరోవైపు ఎంపీ మనోజ్ తివారీ కూడా .. ఆటో డ్రైవర్ల నుంచి తనకు ఆహ్వానం అందిందని, అందుకే వారితో కొంత సమయం గడిపామని చెబుతూ ట్వీట్ చేశారు. మరోవైపు ఆమ్ ఆద్మీపై బీజేపీ దాడికి దిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట ఐదు ఆటోలను ఉంచింది. ఆ ఆటోలను ఆయనకు కానుకగా అందిస్తూ.. "ఢిల్లీలో మాత్రం భద్రతతో ఎందుకు ప్రయాణించాలి, ఇక్కడ కూడా ఆటోలను మాత్రమే ఉపయోగించండి" అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సైటర్లు వేశారు. గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్ హైడ్రామా క్రియేట్ చేశారని ఎద్దేవ చేశారు. త్వరలో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు గెలుపుకోసం అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎలాగైన గెలిచి.. అధికార పగ్గాలను చేపట్టాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa