ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిలలపై శిల్పాలే చెక్కినారు...మనవారు మంచుపై ముగ్గులు కూడా వేశారు మనవాళ్లు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 08:59 PM

కళా ప్రదర్శనకు కాదేది అనర్హం అన్నది మరోసారి రుజువైంది. ఆ అద్భతాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.  కేరళ ప్రజలకు ఓనమ్ చాలా పెద్ద పండుగ. ఆ రాష్ట్ర వాసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మనం సంక్రాంతికి ముగ్గులు వేసినట్టుగా వాళ్లు ఓనమ్ సందర్భంగా వివిధ డిజైన్లు, రంగుల్లో రంగోలీలను వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద రంగోలి ముగ్గును చెక్కిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.


అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. మంచు బాగా గడ్డకట్టి ఉంటుంది. అలా సరస్సులాంటి దానిపై గడ్డకట్టిన మంచుపై కొందరు యువకులు ఓనమ్ ముగ్గును చెక్కారు. ఇందుకోసం చిన్నపాటి సుత్తెలు, స్క్రూ డ్రైవర్లను ఉపయోగించారు. అంతా కలిసి చెక్కినా ఎక్కడా ఆకారం చెడకుండా అద్భుతంగా చిత్రీకరించారు. దాని కింద ఓనమ్ ఎట్ అంటార్కిటికా అనే అక్షరాలనూ చెక్కారు. చివరికి అంతా కలిసి ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫొటోలకు పోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఓనమ్ పండుగను జరుపుకోకుండా ఆపలేం. అది అంటార్కిటికా అయినా సరే. చాలా బాగా రంగోలీ వేశారు..’ అని కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి లక్షల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి. ‘భారతీయులు అంటార్కిటికాలోనే కాదు చందమామపైనా ఓనమ్ పండుగను జరుపుకొనే సమయం దగ్గరలోనే ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘అద్భుతంగా వేశారు..’ అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa