ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు భారత ప్రభుత్వ సహాయం ప్రశంసనీయం: వరల్డ్ బ్యాంక్

international |  Suryaa Desk  | Published : Wed, Oct 05, 2022, 11:46 PM

కొవిడ్‌ సంక్షోభం సమయంలో పేదలు, బడుగు వర్గాలకు భారతదేశం అందించిన సాయం విశేషమైనదని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ప్రశంసించారు.  కరోనా మహమ్మారి కొనసాగిన సమయంలో భారత ప్రభుత్వం 69 శాతం పట్టణ, 85 శాతం గ్రామీణ కుటుంబాలకు ఆహారం లేదా నగదు సాయాన్ని అందజేసిందని ఆయన  పేర్కొన్నారు. ఇందుకోసం డిజిటల్‌ వేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. 


వివిధ దేశాల ప్రభుత్వాలు విస్తృతంగా రాయితీలు ఇవ్వడానికి బదులుగా.. భారత్‌ లో అమలవుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అనుసరించాలని మాల్పాస్ చెప్పారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని వివరించారు. కరోనా మహమ్మారి వెలుగులోకి రావడానికి ముందు మూడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. కానీ ఆ ప్రగతికి కొవిడ్‌-19 ముగింపు పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దేశాలు దీనితో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయన్నారు.


దక్షిణాఫ్రికా దాదాపు 2.9 కోట్ల మందికి 6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే భారీ సామాజిక భద్రతా కార్యక్రమాన్ని అమలు చేసిందని మాల్పాస్ గుర్తు చేశారు. బ్రెజిల్‌ లో ఆర్థిక పరిస్థితులు మందగించినప్పటికీ.. 2020లో డిజిటల్‌ నగదు బదిలీ ద్వారా అత్యంత పేదరికాన్ని కొంత తగ్గించగలిగిందని చెప్పారు. విస్తృత స్థాయి రాయితీలకు బదులు ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa