రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అభివృద్ధిలో మూడు రాజధానుల పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని ఆయన తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టు వివరించారు. భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలన్న సీఎం జగన్ దూరదృష్టి.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వరంగా మారిందని స్పష్టం చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు మద్దతుగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలన్న జేఏసీ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందన్నారు వైవీ సుబ్బారెడ్డి. తాము అమరావతి అభివృద్ధికి అడ్డుపడట్లేదని వైవీ సుబ్బారెడ్డి.. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్ఘాటించారు. విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జేఏసీ తలపెట్టిన విశాఖ గర్జన సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాంధ్ర, విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అలాగని.. అమరావతికి తామేమీ అన్యాయం చేయడం లేదని.. అక్కడ శాసన రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని తేల్చి చెప్పారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని, అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ ఆయన చాలా సార్లు చెప్పారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలును అభివృద్ధి చేస్తామని వివరించారు. విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన నగరమని.. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రముఖ నగరంగా విశాఖ ప్రసిద్ధి చెందిందన్నారు. విశాఖపట్నంలో రాజధానిని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ పాదయాత్ర చేస్తున్న వారికి నిరసన తెలియజేసేందుకే ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన విశాఖ గర్జన సభకు మద్దతు తెలుపుతున్నామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రజలేమీ అడ్డుపడడం లేదన్న సుబ్బారెడ్డి.. అలాంటప్పుడు పాదయాత్ర చేస్తున్నవాళ్లు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎందుకు మోకాలడ్డుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ సిద్ధాంతం పాలనా వికేంద్రీకరణే కాబట్టి.. ఉత్తరాంధ్ర జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామని వివరించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ‘విశాఖ గర్జన’ను విజయవంతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa