‘నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు. నిన్న (అక్టోబర్ 22న) కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుట్టిన రోజు సందర్భంగా.. పవన్ కళ్యాణ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన ట్వీట్ చేసింది. అమిత్ షాకు హిందీలో శుభాకాంక్షలు తెలిపిన జనసేన.. పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దేశం ఐక్యంగా ఉండటం కోసం.. ఆంతరంగికంగా సురక్షితంగా ఉండటం కోసం షా నిరంతరం శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ఈ ట్వీట్కు బదులిచ్చిన అమిత్ షా.. ‘నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు’ అంటూ జనసేనానిని ట్యాగ్ చేశారు. ఇటీవల విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో... మీరు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తారా..? అని పవన్ కళ్యాణ్ను మీడియా ప్రతినిధులు అడగ్గా.. ఆయన కలవబోనని.. ఇక్కడే తేల్చుకుంటానని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. అంతగా కలిసి ముందుకు వెళ్లలేకపోయామని చెప్పారు. బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ ఇవ్వలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారనే ప్రచారమూ జరిగింది.
అమిత్ షా పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం విష్ చేశారు. జగన్ ట్వీట్కు బదులిచ్చిన అమిత్ షా.. చంద్రబాబు నాయుడికి మాత్రం బదులివ్వలేదు. బీజేపీతో స్నేహం కోసం తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు సంకేతాలిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ ఆసక్తి చూపుతోందనే ప్రచారమూ జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం తమ పొత్తు పవన్ కళ్యాణ్తో మాత్రమే అని చెబుతోంది. ఈ నేపథ్యంలో.. పవన్, జగన్లకు బదులిచ్చిన అమిత్ షా.. చంద్రబాబు నాయుడికి మాత్రం రిప్లయ్ ఇవ్వకపోవడాన్ని బట్టి ఆయన ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa