అమరావతి రైతుల పేరుతో జరుగుతోంది కలుషితమైన ఉద్యమని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు గుప్పించారు. అమరావతి రైతుల పేరుతో బినామీ పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో స్పీకర్ తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలి రోజు నుంచీ చెప్తున్నామన్నారు. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని పేర్కొన్నారు. పాదయాత్రలో వెరిఫికేషన్ చేస్తే 70 మంది మాత్రమే అసలైన రైతులని తేలిందని, డ్రామాలు చేస్తున్న వారంతా పట్టుబడ్డారన్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో కేవలం 70 మందే ఐడెంటెటీ కార్డులు పట్టుకుని వచ్చారంటే ఏమనాలని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఐడీ కార్డులు చుపమంటే కళ్యాణ మండపం నుంచి బయటకురాలేదని.. చంద్రబాబు ఒక హిడెన్ అజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు.
ఇక, ప్రపంచ రాజధాని అంటున్న చంద్రబాబుకు విశాఖపట్నం ఎందుకు గుర్తుకురాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూటిగా ప్రశ్నించారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతమని అంటున్నారని.. పోనీ అమరావతి కట్టారా అంటే గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని దుయ్యబట్టారు. శివరామకృష్ణ రిపోర్టు, శ్రీభాగ్ ఒప్పందాలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కమిటీ కాదని, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ అన్నారు. బ్యాంకులు దోచిన వారిని, విద్యను వ్యాపారం చేసిన వారిని చంద్రబాబు కమిటీలో వేశారని తమ్మినేని చురకలంటించారు.
హైదరాబాద్ రాజధానిని ఎందుకు వదిలేసి ఆదరాబాదరాగా వచ్చేశారని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. అమరావతిని తాము రాజధాని కాదనటం లేదని.. కర్నూలు, విశాఖ కుడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేయమని హైకోర్టు అనుమతిస్తే.. తొడలు కొట్టడానికి, రెచ్చగొట్టడానికి ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం సర్వత్రా ఆమోదయోగ్యమన్నారు.
ఉత్తరాంధ్ర పొరాటంలో నాడు ఎందరో మేధావులు త్యాగాలు చేశారని.. నాడు ఎందరో మహానేతలు చేసిన ప్రాణత్యాగాలకు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలనుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నాడు భుస్వామ్య వ్యవస్థపై తిరగబడిందే సిక్కోలు సాయుధ పోరాటమని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa