వేటమాంసం అంటే అబ్బో దాని రేటు ఎక్కువ అంటారు ఎవరైనా. కానీ వేటమాంసం రేటును తలదన్నేలా ఇపుడు కడక్ నాథ్ కోడి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల దేశంలో కడక్ నాథ్ కోళ్ల పెంపకం క్రమంగా విస్తరిస్తోంది. ఈకలు, చర్మం, గుడ్లు, మాంసం సహా మొత్తం నలుపు రంగులో ఉండడం కడక్ నాథ్ కోళ్ల స్పెషాలిటీ. మెలనిన్ అనే హార్మోన్ కారణంగా వీటికి ఆ నలుపు రంగు వస్తుంది. ఇక, కడక్ నాథ్ కోడిమాంసంలో పోషక విలువలు మెండుగా ఉంటాయన్న ప్రచారంతో ధర కూడా ఓ రేంజిలో ఉంది. ఇప్పుడీ వెరైటీ కోడిమాంసం బెజవాడలోకి ఎంటరైంది. ఓ టెక్కీ తన ఉద్యోగాన్ని వదిలేసి కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టడంతో విజయవాడలోనూ కడక్ నాథ్ కోడి మాంసం అందుబాటులోకి వచ్చింది. కేజీ రూ.1000 వరకు ధర పలుకుతోంది. వేటమాంసం రేటు కంటే దీని ధరే ఎక్కువ.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తాను సంపాదించిన సొమ్ము కంటే, ఈ కడక్ నాథ్ కోళ్ల వ్యాపారంతో అధికంగా సంపాదిస్తున్నానని అతడు చెబుతున్నాడు. కడక్ నాథ్ కోళ్లు సాధారణంగా మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుంటాయి. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. రుచి బాగుండడంతో మాంసాహార ప్రియులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇదిలావుంటే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యవసాయ రంగంలోకి ప్రవేశించిన టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టాడు. ప్రత్యేకంగా బ్రీడింగ్ సెంటర్ నుంచి కడక్ నాథ్ కోడిపిల్లలను కొనుగోలు చేసి రాంచీ తీసుకువచ్చాడు. ప్రస్తుతం వాటిని రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో వాణిజ్య ప్రాతిపదికన పెంచుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa