మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అన్న పాట ఊరికేనే రాలేదు. కన్న తల్లిదండ్రులనే చంపేందుకు కుట్ర పన్నాడు ఓ కొడుకు. తండ్రిని చంపితే రూ. 3 లక్షలు, తల్లిని చంపితే రూ. 5 లక్షలు ఇస్తానంటూ ఓ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. తన కారులోనే కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు. పోలీసుల సమయస్ఫూర్తితో రెండు నిండు ప్రాణాలు నిలిచాయి. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి పంపకాలు సరిగా చేయలేదని కక్ష పెంచుకొని కన్నవారినే హత్య చేసేందుకు కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. హత్యకు సుపారీ తీసుకున్న నిందితులు ఇప్పటికే రెక్కీ నిర్వహించారు. తమ ప్రణాళిక అమలు చేసే దశలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే 94 గ్రాములు బంగారం, రూ. 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు ఎస్పీ విజయరావు తెలిపారు.
ముత్తుకూరు మండలానికి చెందిన షేక్ గౌస్ బాషా, బుచ్చిరెడ్డి పాలెం పట్టణానికి చెందిన షేక్ షాహుల్ పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నారు. దొంగతనాల కేసుల్లో విచారణ ఖైదీలుగా జైల్లో ఉన్న సమయంలో కావలి పట్టణానికి చెందిన షేక్ షఫీ అనే వ్యక్తితో వీరికి పరిచయం ఏర్పడింది. ఓ హత్యకు సంబంధించిన కుట్రను వారిద్దరితో పంచుకున్నాడు.
కావలి పట్టణానికి చెందిన మురుసు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆస్తి వాటా పంపకాల్లో తన తల్లిదండ్రులు తనకు అన్యాయం చేశారని కోపం పెంచుకున్నాడు. సుమారు 15 ఏళ్ల కిందట జరిగిన ఆ ఆస్తి పంపకాల్లో తనకు దక్కకుండాపోయిన ఆస్తి ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతుందని భావిస్తున్నాడు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత సోదరుడిని కూడా హత్య చేసి ఆ ఆస్తిని దక్కించుకోవాలనేది అతడి ప్రణాళికగా తెలుస్తోంది. తండ్రిని చంపితే రూ.3 లక్షలు, తల్లిని చంపితే రూ. 5 లక్షలు ఇస్తాడని షేక్ షఫీ మిగతా ఇద్దరు నిందితులు గౌస్ బాషా,షేక్ షాహుల్కు తెలుపగా.. ముగ్గురూ కలిసి హత్యకు ప్రణాళిక చేశారు. ఆటోలో పలుమార్లు రెక్కీ నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఓ దొంగతనం కేసులో నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కత్తులు కొని లక్ష్మీనారాయణకు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారులోనే ఉంచినట్టు నిందితులు తెలిపారు. కార్తో పాటు కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం కేసును చేధించడంతో పాటు రెండు హత్యలను ఆపడంలో కావలి పోలీసులు కృషి చేశారని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా పోలీసులను సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa