ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను మరోసారి వెండి తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు డైరెక్టర్ ఆర్జీవీ ‘వ్యూహం’ ‘శపథం’ పేరుతో సినిమాకు సిద్ధమయ్యారు. రెండు పార్టులుగా మూవీ తీయబోతున్నట్లు ప్రకటించారు. అంతకముందు రోజే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నేత వర్మకు బంపరాఫర్ ఇచ్చారు.. ఈ సినిమాలో తన పాటలను వాడుకోవాలని కోరారు. రైట్స్ ఇస్తానంటూ ఆఫర్తో ముందుకొచ్చారు.
టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్ ఆర్జీవీకీ ఈ ఆఫర్ ఇచ్చారు. పార్టీలో సాంస్కృతిక విభాగం బాధ్యతలు చూసే వ్యక్తిగా.. చిన్న బాధ్యతగా అనిపించి ఆర్జీవీకి కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను అన్నారు. సీఎంను వర్మ కలిశారు.. ఎవరు ఏమడిగినా ఏం చెప్పలేదు.. ఆయనేదో సినిమా తీయబోతున్నట్లు.. కొన్ని అంశాలను సీఎం నుంచి సేకరించడానికి వెళ్లానన్నారని తనకు తెలిసిందన్నారు.
ఈ సినిమాలో నిజాలు ఉంటాయన్నారు అంటే.. గతంలో తీసిన సినిమాల్లో అబద్దాలు, కల్పితాలు ఉన్నట్లా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ ప్రముఖ వ్యక్తి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలు ప్రజల్లో ఉండే మేము ఆర్జీవీకి చెప్పాలనిపించిందని.. సినిమాలో ఫస్ట్ పాట ఏది పెట్టాలో నరసింహ ప్రసాద్ చెప్పారు. తన పాటలకు మంచి ప్రజాదరణ వచ్చిందని.. సినిమాలో ఉపయోగించుకోవాలని కోరారు. రామ్ గోపాల్ వర్మ అడిగితే.. తన పాటల రైట్స్ ఇచ్చేస్తాను అన్నారు.
రెండు పార్టులుగా తీయబోయే సినిమాపై వర్మ ప్రకటన చేశారు. ఆర్జీవీ తన ట్వీట్లో.. 'వ్యూహం' పేరుతో తొలి భాగాన్ని.. 'శపథం' పేరుతో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన 'వ్యూహం' కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. రెండు పార్ట్ల్లోనూ రాజకీయ అరాచకాలు ఉంటాయని.. ప్రేక్షకులు తొలి చిత్రం షాక్ నుంచి తేరుకునేలోపే.. వారికి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్-2 రూపంలో తగులుతుంది అంటూ బాంబ్ పేల్చారు.
తాను గతంలో తీసిన ‘వంగవీటి’ సినిమా నిర్మాతే ఈ సినిమాను నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్పిక్.. బయోపిక్లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్లో అన్నీ నిజాలే ఉంటాయి అన్నారు. వర్మ. అంతేకాదు ‘BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం’ అంటూ తన సినిమాకు కొత్త లెక్కల్ని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, జగన్ల ప్రస్తావన ఉంటుందని చెప్పకనే చెప్పారు. కూడికలు, తీసివేతలతో మరింత హైప్ పెంచారు. ఈ సినిమాలో ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa