ఏపీలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే మరోవైపు జనసేన పార్టీలో చేరికలు కూడా మొదలవుతున్నాయి. ఇదిలావుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. జనసేనాని విజయవాడ ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం కనిపించింది. మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పవన్ను కలిశారు. ఇద్దరు ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో బాడిగ జనసేన పార్టీలో చేరతారా అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారా.. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
బాడిగ రామకృష్ణ 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ చేతిలో ఓడిపోయారు. తన హయాంలో నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మంచిపేరు తెచ్చుకున్నారు. 2009లో ఓటమిపాలైన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన పవన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే రామకృష్ణ కుమార్తె శ్రీదేవి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆమె పెడన సీటు ఆశించినా దక్కలేదు.. ఆమె మాత్రం పార్టీలో కొనసాగుతున్నారు. 2024లోనైనా అవకాశం వస్తుందని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. శ్రీదేవిని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి పవన్ను కలవడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ అదే జరిగితే సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. మరి మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ అడుగులు ఎటువైపు ఉంటాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa