ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య చూస్తే ఆయనలో ఎంత ఫ్రస్టేషన్ ఉందో అర్థం అవుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా దూషణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలను కూల్చే అవకాశం, హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కూల్చేయటానికి ప్రభుత్వం అంటే ఏమైనా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా అని పవన్ కళ్యాణ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో 53 ఇళ్లను కూల్చేశారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రోడ్డు వైడనింగ్ కోసం జనవరిలోనే మార్కింగ్ చేశారని అంబటి రాంబాబు తెలిపారు. జనసేన పార్టీ సభ జరిగింది మార్చి నెలలో అన్న మంత్రి అంబటి.. రోడ్డుకు ఒకవైపు గతంలోనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు అవగాహన లేనట్లు ఉందని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా పడగొట్టలేదని పేర్కొన్నారు. డ్రైన్ కట్టే క్రమంలో ఆక్రమణలను తొలగించారని, ఇది ఇంకెక్కడా జరగలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ‘‘పవన్ కళ్యాణ్ను అంతమొందించటానికి రూ. 250 కోట్ల సుపారీ ఇచ్చారట.. గుజరాత్కు చెందిన వాళ్లకు రూ. 250 కోట్లు ఇవ్వటం ఎందుకు ఇందులో సగం డబ్బులు పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ ఇస్తే చాలు కదా. తోక ఆడించుకుంటూ వస్తారు’’ అని మంత్రి అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు తనపై ఒక చిన్న రాయితో హత్యాయత్నం జరిగిందంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ డైలాగులు చూస్తే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోందని, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నం చేయవద్దని హితవుపలికారు. పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్కు తన సలహా ఇదని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాది అని, యువత జాగ్రత్తగా ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామానికి రూ. 50 లక్షలు ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa