ఉద్యోగాలిప్పిస్తామని ఏకంగా పోలీసులే మోసాలకు పాల్పడ్డారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా కేటుగాళ్లు మోసాలకు పాల్పడితే బాధితులు పోలీసులను ఆశ్రయించడం సర్వసాధారణం. అయితే, పోలీసులే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచేస్తే.. ఇంకెవరిని నమ్మాలి? విజయవాడ నగరంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కానిస్టేబుళ్లు.. నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు దోచుకున్నారు. చివరికి, బాధితుల ఫిర్యాదుతో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి.. గత రెండేళ్ల నుంచి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. అయితే, రెండు నెలల నుంచి ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ బాధితులు హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు.
దీంతో నకిలీ ఉద్యోగ పత్రాలు ఇచ్చి.. ఇదే నియామకపత్రాలని బాధితులకు సురేష్, సుబ్బారెడ్డి నమ్మబలికారు. అయితే, ఆ ప్రత్రాలు నకిలీవని బాధితులు గుర్తించి వారిని నిలదీశారు. ఈ విషయం మీడియాలో రావడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa