ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రోజుల పాటు విశాఖలో ప్రధాని... షెడ్యూల్ వెల్లడించిన బీజేపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 01:52 AM

ఏపీ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. విశాఖలో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇక, రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సంబంధించిన వివరాలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు.


ఈ మేరకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తామని వెల్లడించారు. కంచెర్లపాలెం నుంచి ఓల్డ్ ఐటీఐ వరకు కిలో మీటర్‌ మేర ఈ రోడ్‌ షో ఉంటుందన్నారు. 11న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతుందని.. ఆ తర్వాత, ఐఎన్‌ఎస్‌ చోళలో బస చేస్తారని తెలిపారు.


ఇక, ఈ నెల 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని.. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులేనని ఎంపీ జీవీఎల్ చెప్పారు. ఇందులో రూ. 152 కోట్లతో చేపట్టే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైందన్నారు. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు ఇదొక వరం లాంటిదని పేర్కొన్నారు. అలాగే, రాయ్‌పూర్- విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని ఒంగుల్ వరకు పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం లాంటివి ఉన్నాయని జీవీఎల్ వివరించారు.


ఇక, ప్రధాని పర్యటనలో ఏపీ రాజధాని అంశం లేదని ఎంపీ జీవీఎల్ తేల్చిచెప్పారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్రానికి రైల్వే జోన్‌ను ప్రకటించామని.. త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు. ఇది ప్రధాని మోదీ అధికారిక పర్యటన కాబట్టి.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఆహ్వానించడంపై పీఎంవో నిర్ణయం తీసుకుంటుందన్నారు.. కానీ, ప్రధాని మోదీ విశాఖ పర్యటనను చిన్న చిన్న రాజకీయాల కోణంలో చూడొద్దన్నారు. ప్రధాని మోదీ ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం వైజాగ్ ప్రజలకు ఎంతో గర్వకారణం అన్నారు. విశాఖ అభివృద్ధికి, బీజేపీ బలోపేతం కావడానికి ప్రధాని మోదీ టూర్ టేకాఫ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa