ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ విశాఖ రాక నేపథ్యంలో... భారీ ఆందోళనకు విశాఖ ఉక్కు కార్మికుల సన్నాహాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 01:53 AM

విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తమ నిరసన తెలపాలని విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, నిర్వాసితులు గాజువాకలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ‘ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు భారీ ర్యాలీ చేసేందుకు నిర్ణయించారు.


ఇందులో భాగంగా విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకూ ర్యాలీగా బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి గాజువాక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నామని.. దీన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ఈ సందర్భంగా కార్మికులు మండిపడ్డారు. ప్రాణత్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa