ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత్వం ఇంకా బతికుందని ఆ ఆటో డ్రైవర్ నిరూపించాడు

national |  Suryaa Desk  | Published : Sun, Nov 13, 2022, 04:47 PM

మానవత్వం ఇంకా బతికుందని కొందరు మనుషులు తమ చర్యల ద్వారా నిరూపిస్తుంటారు. అలాంటి ఘటనే ఇది.  ఓ ఆటో డ్రైవర్ నిజాయితీకి పోలీసులు ఫిదా అయ్యారు. మహిళ మెడలో నుంచి జారపడిన బంగారు గొలుసు దొరికితే దాని కోసం ఆశపడలేదు. నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దానిని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన చెన్నైలోని అరక్కోణం సమీపంలో చోటుచేసుకుంది. పట్టణంలోని టౌన్‌హాల్‌ వీధికి చెందిన ప్రియదర్శిని (34) అనే మహిళ దిండివనం వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం బస్సు ఎక్కింది. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికుల తోపులాటతో ఆమె మెడలోని బంగారు గొలుసు తాళిబొట్టు జారి కిందపడిపోయింది. అయితే, బస్సు ఎక్కే హడావుడిలో ఆమె గమనించలేదు. పైగా చేతిలో చంటిబిడ్డ కూడా ఉండటంతో గొలుసు జారిపోయినా పట్టించుకోలేదు.


బస్సు ఎక్కి వెళ్లిపోగా.. ఆ గొలుసు కిందపడటాన్ని అక్కడే ఉన్న దండపాణి అనే ఆటో డ్రైవర్ గమనించాడు. దానిని వెంటనే తీసుకుని దండపాణి పట్టణ పోలీస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఇంతలో తాను గొలుసు పోగొట్టుకున్న విషయం గుర్తించిన ప్రియదర్శిని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. అప్పటికే దండపాణి ఆ గొలుసును పోలీసులకు అప్పగించడం.. వారు ఎక్వైరీ చేసి చివరకు ప్రియదర్శినికి అప్పగించారు. నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్ దండపాణికి పోలీసులు శాలువా కప్పి సత్కరించారు.


గతేడాది జనవరిలో చెన్నైకు చెందిన శరవణ్ కుమార్ అనే ఆటో డ్రైవర్.. తన ఆటో ఎక్కిన ప్రయాణికుడు మరచిపోయిన రూ.20 లక్షల విలువైన బంగారం తిరిగి అప్పగించి వార్తల్లో నిలిచాడు. బంగారు నగలున్న బ్యాగును గమనించిన వెంటనే ప్రయాణికుడిని వెతుక్కుంటూ బయల్దేరి వెళ్లి అడ్రస్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఆటో డ్రైవర్ శరవణ కుమార్.. చేసేదేంలేక చివరికి ఆ నగల బ్యాగుతో క్రోమెపేట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అప్పగించాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa