రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని చంద్రబాబు అనుకుంటున్నారా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం తన హక్కు అన్న ధోరణితో పాటు పొగరు కనిపిస్తోందని విమర్శించారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.
తనకు ఇవే చివరి ఎన్నికలంటూ తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు చివరి ఎన్నికలని ఆయనే కాదు.. ప్రజలు కూడా అనుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే 2019లోనే చంద్రబాబును, టీడీపీని సాగనంపారని కౌంటర్ వేశారు. దింపుడు కళ్లెం ఆశలాగా చివరి ఛాన్స్ అంటూ ప్రజల్ని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. తన కోసం ప్రజలు ఉన్నారని చంద్రబాబు భ్రమ పడుతున్నారన్నారు. ఒకటికి పది సార్లు తన భార్య గురించి ప్రజల్లో చెప్పి.. చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. బహుశా చంద్రబాబు ప్రవర్తన వల్ల.. ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమోనని సందేహం వ్యక్తం చేశారు. లేనివన్నీ చంద్రబాబే ప్రజలకు గుర్తు చేస్తున్నారని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa