ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాన్ మస్క్ పోల్ లో....ట్రంప్ కు మద్దతు పలికిన 51.8 శాతం మంది నేటిజన్లు

international |  Suryaa Desk  | Published : Sun, Nov 20, 2022, 03:13 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు నేటిజన్లు పెద్ద ఎత్తున్న మద్దతు పలికారు. ఏకంగా 51.8శాతం మంది అనుకూలంగా ఓటేశారు. క్యాపిటల్ హిల్ భవనంపై దాడి తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ట్విటర్‌ ఖాతాను పునరుద్దరించినట్టు ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్‌ను ట్విట్టర్‌లోకి అనుమతించాలా? వద్దా? అనే అంశంపై పోల్‌ నిర్వహించగా మెజార్టీ నెటిజన్లు ఆయనకు అనుకూలంగా ఓటేశారు. పోల్ తర్వాత ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఆదివారం వెల్లడించారు. అయితే, దీనిపై ట్రంప్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో ఆయన చేసిన ట్వీట్‌లతో కూడిన అకౌంట్‌ ప్రస్తుతం కనిపిస్తోంది.


ట్రంప్‌ ట్విటర్‌‌లోకి అనుమతించే అంశంపై నిర్వహించిన పోల్‌లో కోటిన్నర మందికిపైగా పాల్గొన్నారు. వీరిలో 51.8 శాతం మంది ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించడానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 48.2 శాతం మాత్రం వ్యతిరేకించారు. మెజారిటీ నెటిజన్లు పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేయడంతో మస్క్‌ ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రజల తీర్పే దైవ నిర్ణయం’ అని అర్థం వచ్చే లాటిన్‌‌ పదాలను మస్క్ పోస్ట్‌ చేశారు. మస్క్ గతంలోనూ ఇటువంటి పోల్స్ నిర్వహించారు. టెస్లా ఎలక్ట్రిక్ కారు అమ్మకంపై నెటిజన్ల అభిప్రాయం తెలుసుకోడానికి గతేడాది పోల్ నిర్వహించి, బిలియన్‌కుపైగా షేర్లను అమ్మారు.


‘‘బైడెన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు’’ అంటూ 2021 జనవరి 8న ట్రంప్‌ చేసిన చివరి ట్వీట్‌తో ప్రస్తుతం ఆయన ఖాతా కనిపిస్తోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు.. 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా రద్దు చేసింది. సోషల్ మీడియా దిగ్గజం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అప్పటికి ట్విటర్‌లో న్యాయ నిపుణురాలిగా ఉన్న భారతీయ అమెరికన్‌ విజయ గద్దె కీలక పాత్ర పోషించారు.


హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకే ట్రంప్‌ ఖాతాను రద్దు చేస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత సీఈఓ పరాగ్‌ అగర్వాల్ సహా విజయ గద్దెను ఆయన తొలగించిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో మస్క్‌ పోల్‌‌ను స్వాగతించిన డొనాల్డ్ ట్రంప్.. మస్క్‌ అంటే తనకు ఇష్టమని చెప్పారు. అయితే, తిరిగి ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండటానికి పరోక్షంగా విముఖత వ్యక్తం చేశారు. తాను ‘ట్రూత్‌ సోషల్‌’ అనే సొంత సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. పైగా ట్విటర్‌కు తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa